9, నవంబర్ 2021, మంగళవారం

మా బడి కతలు - గరిపెల్లి అశోక్

 సమకాలీన బడి జీవనం... గరిపల్లి అశోక్ మా బడి కతలు

(పుస్తక సమీక్ష-7)


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.


ప్రస్తుత తెలుగు బాలసాహిత్యం దినదినాభివృద్ధి చెందుతూ నూతన చరిత్రను సృష్టిస్తుంది. ఒకరకంగా చెప్పుకోవాలంటే సాహిత్యంతో చరిత్రను తారాస్థాయిలో నిలుపుతుంది. బాల సాహిత్య కృషికి నిండు మనసుతో, అంకితభావంతో అటు వర్ధమాన రచయితలు, బాల రచయితలు ( బడి పిల్లలు), ఇటు మేలైన సాహిత్యాన్ని, నవభారతాన్ని రూపొందించాలనే ఆశయం, లక్ష్యం కలిగిన పెద్దలు (రచయితలు) అహర్నిశలు తమ సిరా స్వేదాన్ని చిందిస్తున్నారు.పిల్లలు , పెద్దలు ఎవరికి వారు నిత్యం బాల సాహిత్య ఉద్యానవనం పెంచాలని పోటీ పడుతూనే ఉన్నారు. నిరంతరం పిల్లలు, పెద్దలు సాహిత్య కార్యశాలలు నిర్వహిస్తూ, పాల్గొంటూ తెలుగుజాతికీ నిండయిన గౌరవం తీసుకొచ్చేలా పిల్లలు ఉపమన్యులులా, పెద్దలు భగీరథ మహర్షుల పట్టుదలతో సాహిత్య తపస్సుని ఆచరిస్తున్నారు. సాహిత్య పరిమళాలను వెదజల్లుతూ ఉన్నారు.



అలా నిరంతరం సాహిత్యం కోసం పాటుపడుతూ, ఇప్పుడు మేలైన సాహిత్యాన్ని, చిగురించిన ప్రతి అక్షరాన్ని పిల్లల దాకా తీసుకెళ్లాలి అనే లక్ష్యం ఉన్న సాహితీవేత్తల్లో గరిపల్లి అశోక్ గారు ముందంజలో ఉంటారు. ఇంటర్మీడియట్ స్థాయిలోనే "నాంది" కవిత్వ సంకలనం తీసుకు రావడం తోనే బోధపడుతుంది వారికి సాహిత్యంపై అవధులు లేని అవ్యాజపు అభిమానం.


ముస్తాబాద్ బడి పిల్లలు రచించిన"జాంపండ్లు" కథా సంకలనానికి, తెలంగాణ బడి పిల్లల రాసిన"ఆకుపచ్చని ఆశలతో"కవితా సంకలనానికి, ఇలా ఎన్నో బాల సాహిత్యంలో బాలల మదిలో పూసిన అక్షరాలను సంకలనాలుగా వెలువరించిన సంపాదకులు.'బాలచెలిమి' నుండి మణికొండ వేదకుమార్ సంపాదకత్వంలో వెలువడిన 'తెలంగాణ బడి పిల్లల కథలు' ప్రాజక్టుకు కన్వీనర్ గా వ్యవహరించారు. 'దూడం నాంపల్లి రచనలు-పరిశీలన' ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం. "ఎంకటి కతలు', 'మా బడి కతలు', 'సరికొత్త ఆవు-పులి కథలు' ఇటీవల అచ్చయిన బాలల సాహిత్యం. . గరి పెల్లి అశోక్, డా, పత్తిపాక మోహన్ కలిసి తెస్తున్న 'కరోనా కతలు' అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి.


ఇప్పుడు బడి పిల్లల జీవితం పై, సమాజంలో చోటుచేసుకునే అంశాలనే రచయిత గరిపల్లి అశోక్ కథావస్తువులుగా తీసుకుని తెలుగు సాహిత్యంలో ఒక నూతన చరిత్రను సృష్టించే గొప్ప ప్రయత్నం చేశారు.


బడిలో పిల్లలు ఎలా ఉంటారో, బడి జీవనం ఎలా ఉంటుందో (ప్రభుత్వ పాఠశాల ఇందులో), బడి పిల్లల అంతర్గత జీవితాలను, విద్యార్థుల వ్యవహారపు తీరు పట్ల ఉపాధ్యాయులు తీసుకునే జాగ్రత్తలను, పరిష్కారాలను అందంగా, కన్నీరు ఒలికేలా కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు.


ఈ కథల్లో కేవలం గరిపల్లి అశోక్ గారు అక్షరాలను కాదు, ఆశయం, ఆవేదనను జోడించి రచించారు. ఒకరకంగా చెప్పాలి అంటే కథ మన మాటలతో కాదు, కథలోని నాయకుడితో మాట్లాడితే కథ చదువరుల హృదయాల్లో జీవిస్తుంది అన్న తరహాలో లిఖించారు. అక్కడక్కడ తెలంగాణ యాసను జోడిస్తూ, కథలను కొత్త తరహాలో నడిపించారు.


మొదటి కథ "కరపత్రం", పేద కుటుంబంలో జీవిస్తూ, ఆలనా పాలనా చూసుకునే తండ్రి లేక, తల్లి కూలి కష్టంతో బ్రతుకుతూ, కనీసం రాసుకోవడానికి పుస్తకాలు కూడా కొనుక్కోలేక, దొరికిన కరపత్రాలనే రఫ్ నోట్స్ లాగా వాడుకుంటూనే, బడికి క్రమం తప్పకుండా వెళుతూ, ఎప్పుడూ ప్రథమంగా నిలిచే శేఖర్ లాంటి విద్యార్థుల జీవితాలు ఇప్పుడు కోకొల్లలు. అలాంటి జీవితా లను కళ్ళకు కట్టినట్లు రాసారు రచయిత.


"బొంతలు" కథలో కూడా విహార యాత్రలో భాగంగా విద్యార్థులందరూ కొత్త బెడ్షీట్లు, దిండ్లు తెచ్చుకుంటే మహేష్ మటుకు పాత చీరలతో , లుంగీ లతో, పాత ధోతీలతో అందంగా కుట్టిన బొంతులను తెచ్చుకోవడం, అది చూసిన సహవిద్యార్థులు మహేష్ ని హేళన చేయడం, మహేష్ బాధపడడం, తరువాత ఉపాధ్యాయులు వచ్చి మహేష్ ని ఓదార్చి సహ విద్యార్థులు అందరకు వ్యర్థాలకు అర్థాన్నిచ్చే విషయాలు చెప్పడం,వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకోవడం మంచి పద్ధతి అని బోధించడం, ధనం లేకపోవబట్టే మహేష్ మీలాగా కొత్త దిండ్లు బెడ్షీట్లు తెచ్చుకోలేదని, అతని వద్ద డబ్బు ఉంటే అతను కూడా మీలాగే చేసేవాడని, పక్క వారిని హేళన చేయకూడదు అని హితబోధ చేయడంతో కథ కంచికి వస్తుంది. అచ్చంగా ఈ కథలో జరిగేవే నేడు పాఠశాలలో జరుగుతున్నాయి.ఇలాంటి కథలు చదువుతున్నంత సేపు పాఠకుల కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉంటాయి.


"నీళ్లు" కథ అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా కథలు మటుకు విద్యార్థుల జీవితాలను చూపిస్తే, "నీళ్లు", "చెత్త బుట్టలు" వంటి కథలు రాజుల కాలం నాటివే అయినప్పటికీ, పరిశుభ్రత, పరిపూర్ణ హృదయం ఎలా ఉంటాయో చక్కగా వివరించిన కథలు. దురాశకు పోతే జరిగే పరిణామాలు వివరించిన కథలు.


"నిజాయితీ", "ఫిల్టర్లు" కథలు అందరినీ ఆకర్షిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులోని 15 కథలు మణిరత్నాలే అని చెప్పుకోవచ్చు."మా బడి కతలు" వయ్యిలోని ప్రతి కథకు కూరేళ్ళ శ్రీనివాస్ గారు ఆయని కుంచెతో అందమైన చిత్రాలు చిత్రించి పుస్తకంలోని కథలలాగే శోభ తీసుకొచ్చారు. కేవలం నీతినే కాకుండా, మన కళ్ళ ముందు జరిగే జీవితాలనే కథలుగా రాయడం రచయిత గరిపల్లి అశోక్ గారికి సమాజం పై ఉన్న పట్టు, అవగాహన ఏంటో తెలుస్తుంది.


ఇలాంటి కథలు కచ్చితంగా నేటి తరానికి అవసరం. ఒక్క సారి చదివామంటే చాలు, ఇవి మన హృదయాలలో గూడు కట్టేసుకుంటాయి. అమలినమైన సాహిత్యాన్ని పిల్లల హృదయాలు దాకా తీసుకు రావాలనే రచయిత ఆకాంక్ష ఈ కథలో పొందుపరచబడి ఉంది. అన్ని వర్గాలకు వారికి ఉపయోగపడే ఇలాంటి కథలు (జీవితాలు) లిఖించి నందుకు రచయితను అభినందించకుండా ఉండలేం. ఇలాంటి రచనలు వెలుగులోకి వస్తే రేపు మన సమాజం దివ్యంగా, వైభవంతో విలసిల్లుతుంది. జై బాలసాహిత్యం!!


Published in Molaka news daily web magazine. Link 👇

సమకాలీన బడి జీవనం

14, సెప్టెంబర్ 2021, మంగళవారం

బాలలకో బహుమతి - వురిమళ్ల సునంద

⟾  సునంద అత్త ఇచ్చిన అందమైన బహుమతి

వురిమళ్ళ సునంద గారు రాసిన బాలలకో బహుమతి పై పుస్తక సమీక్ష



పిల్లలకి కథలు అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే కథలు వాళ్ళతో మాట్లాడితాయి కాబట్టి? కథలు, పిల్లల చేతిని పట్టుకొని, ఏవేవో ఊసులు చెబుతూ ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళ్లి వాళ్ళు మర్చిపోలేని కొన్ని దృశ్యాలను చూపిస్తాయి కాబట్టి! వాళ్లని నవ్విస్తాయి కాబట్టి.. "అవునా, తర్వాత ఏంటి?" అనేలా పిల్లల్ని తమవైపు తిప్పేసుకుంటాయి కాబట్టి! అరచేతుల్లో జీవిత సారాన్ని చూపించి, మంచి బాట వైపు వాళ్లని నడిపిస్తాయి కాబట్టి!


వురిమళ్ళ సునంద (భోగోజు), రచయిత్రి



బడిలో చదివే పిల్లల కోసం ఎలాంటి కథలు అయితే బాగుంటాయి? ఆ ప్రశ్నకు సమాధానం ప్రముఖ రచయిత్రి, ఉపాధ్యాయురాలు వురిమళ్ళ సునంద రాసిన "బాలలకో బహుమతి" చెబుతుంది.. ఉపాధ్యాయురాలు కాబట్టి రోజూ పిల్లల్ని గమనించి, వాళ్ళ అల్లరి మనస్తత్వాలను అర్థం చేసుకుని,వారికెలాంటి కథలైతే ఎగిరి గంతులు వేస్తారో సరిగ్గా అలాంటి కథలే రాశారు సనంద అత్త. సరళమైన భాషలో, వారికి చదవడానికి తేలికగా ఉండేలా,ద్విత్వ సంయుక్తాక్షరాలు లేకుండా 14 కథల్ని రాసి బాలలకో బహుమతి పుస్తకం పేరుతో మనముందుకు తీసుకొచ్చారు. ద్విత్వ సంయుక్తాక్షరాలు లేకుండా కథలు, నవలలు చాలా తక్కువ వచ్చాయి.. డా.ఎం. హరికిషన్ లాంటి ప్రముఖ బాలసాహితీవేత్తలు ఇలాంటి రచనలు చేశారు..




ఇందులో మొదటి కథ చెలిమి విలువలో, జంతువుల పాత్రను పెట్టి, మనింటి దగ్గరో,వీధిలోనో, బడిలోనో మనం వినే "నువ్వు ఆ ఫ్రెండ్ తో స్నేహం చేయకు" అనే మాటలనే కథా వస్తువుగా తీసుకుని కథను అల్లారు.




పూర్తిగా పగలే ఉంటే బాగుంటుంది కదా ఎంచక్కా ఆడుకోవచ్చు, పూర్తిగా రాత్రే ఉండొచ్చు కదా ఎంచక్కా నిద్రపోవచ్చు అని ముద్దు ముద్దుగా పిల్లలు అడిగే కొన్ని గమ్మత్తైన ప్రశ్నలకు, మాటలకు సమాధానంగా ఓ కొత్త ఆలోచన చేసి "పగలు రేయి లేకుంటే" అనే చక్కని కథని అల్లారు. ఇలాగే "పాలు నీరు చెలిమి" అనే కథ కూడా భలే సరదాగా సాగుతూ ఆకట్టుకుంటాయి.




చిలిపి చిలుక కథలో, చిన్న పిల్లల మనస్తత్వం ఉన్న చిలుకను పాత్రగా పెట్టి, వాళ్ళ అల్లరిని అందంగా చూపించి, తెలివైన స్నేహితులు, పెద్దలు వారి అల్లరికి చెక్ పెట్టే అందమైన నెరేషన్ ఇందులో మనకు కనిపిస్తుంది.




ఇలా ఈ సంపుటిలో అన్నీ పిల్లల్ని ఆకట్టుకునే అంశాల్ని తీసుకుని, ఎక్కువగా జంతువుల పాత్రలను పెట్టి వాళ్ళ అల్లరి మనస్తత్వాలను చక్కగా చూపించే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు రచయిత్రి.ద్విత్వ సంయుక్తాక్షరాలు లేకుండా కథలు రాయడమనేది ఒక ప్రయోగంలా మనం చూడకుండా,కథల నిర్మాణం పరంగా చూస్తే పిల్లలకు సున్నితంగా ఎలా కథలు చెప్పాలో తెలుసుకోవచ్చు.పుస్తకం రూపం గురించి కొంచెం చెప్పాలి.లెటర్ సైజు(మనం A4 అని పిలిచే పేపర్ సైజ్)లో పుటలు, ఆయిల్ పేపర్ వాడి,ప్రతి పేజీలో పమ్మి ఉపేంద్రాచారి గారి అందమైన బొమ్మలతో అందంగా ముస్తాబు చేశారు. ఇలాంటి కథలు మన పిల్లల దాకా చేరగలిగితే రేపు మనం ఆశించే స్వచ్ఛమైన సమాజాన్ని చూడొచ్చు.తెలుగు బాలసాహిత్యంలో పిల్లల కోసం ఒక మంచి కథల బహుమతిని వెలువరించిన రచయిత్రి సునంద గారికి హృదయపూర్వక అభినందనలు.. బాల సాహిత్యంలో పిల్లల దాకా చేరే మరెన్నో రచనలు చేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాం...

6, సెప్టెంబర్ 2021, సోమవారం

కథా శతక పద్యం - డా‌. బి.వి.ఎన్. స్వామి

  •  తెలుగు వారసులకు బహుమతి.. క.శ.ప (కథా శతక పద్యం) (పుస్తక సమీక్ష)
  • పుస్తక రచయిత:-డా| బి.వి.ఎన్. స్వామి
  • పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల.


తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియకు, శతక పద్యాలకు విశిష్టమైన స్థానం ఉంది. కథ చెప్పుకోవడానికి కనువిందుగా ఉంటే, నీతిశతక పద్యాలలో మాత్రం నాలుగు పాదాల్లో శతక కవి ఏం చెప్పదలచుకున్నాడో ఇట్టే అర్థమైపోతాయి.


 

రెండు సాహిత్య ప్రక్రియలు కూడా నైతిక విలువలు నూరుపోస్తూ, చక్కని నడవడిని నేర్పిస్తూ, ఆలోచింపజేసే తత్వాన్ని రేకెత్తిస్తాయి.

పసి మనసుల్లో సద్గుణాలు విరబూయాలనే దృక్పథంతో ఆనాడు కథలు, సామాజిక విలువలు, చైతన్యం, ప్రజా జాగృతి రావాలనే సదుద్దేశంతో ఆనాడు శతక కవులు నీతి శతకాలను రాశారు. వేమన పద్యాలు, సుమతి సూక్తులు ఈనాటికీ ప్రతి తెలుగువారి నాలుకలపై నాట్యం చేస్తూ అందరిని రంజింప చేస్తున్నాయి.

Author:- B.V.N. Swamy 



ప్రస్తుతం నేటి బాలల్లో కథలు చదివే తత్వం కాస్తోకూస్తో ఉంది. కథల పుస్తకమో, లేదా ఉపాధ్యాయులు చెప్పే చిట్టి చిట్టి కథలుకు మురిసిపోయి గంతులేస్తుంటారు. కానీ మన వారసత్వంగా వచ్చిన అమూల్యమైన నీతి శతక పద్యాలు అంటే కాస్త చేదు భావాన్ని వ్యక్త పరుస్తారు. "ఈ పద్యాన్ని నేనెలా గుర్తుంచుకుంటాను బాబోయ్, ఈ పదాలు నేనెక్కడ పలకగలను బాబోయ్," అంటూ వెనక్కి మళ్ళి పోతున్నారు. నీతి శతక పద్యాలు అంటే కేవలం నీతి సంపదే కాదు, జ్ఞానం పదకోశ భాండాగారం. నాలుగు పాదాల్లో గొప్ప అర్ధాన్నిచ్చే మన నీతి శతక పద్యాలను పక్కన పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మనది తెలుగుజాతి. నీతి శతక పద్యాలు మనకు వజ్రవైఢూర్యాలు తో సమానం. ఎంత దాచుకుంటే అంత ఉన్నతుడిని చేస్తాయి.


ఆధునిక పరిజ్ఞానం పెరగడం ద్వారా సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు వంటివి పిల్లల చేతుల్లోకి రావడం వలన తెలుగు పిల్లలు పద్యాలను పక్కన పెట్టేస్తున్నారు. రేపు మన శతక పద్యాలు, శతక కవులు, కమ్మని కథలు మరుగున పడిపోకూడదనే సత్సంకల్పంతో రచయిత బి.వి.ఎన్ స్వామి గారు తమ సాహిత్య అనుభవాలుతో ఈ క.శ.ప(కథా శతక పద్యాలు) అనే నిత్యనూతన కథా ప్రక్రియను సృజించారు. మన తెలుగు భాషలో కవిత్వం, కొత్త సోయగాలతో రోజుకొక ప్రక్రియగా రూపుదిద్దుకుంటున్నాయి. కానీ కథా ప్రక్రియ మటుకు "గల్పిక, కార్డు కథలు, మినీ కథలు వంటి" వేళ్ళ మీద లెక్క పెట్టే సంఖ్యలోనే ఉంటున్నప్పటికీ కొత్తగాను, కొత్తదై పరిమళిస్తుంది తెలుగు కథా ప్రక్రియ.


తెలుగు కథా సాహిత్యానికి, నీతి శతక పద్యాలకు నూతన రూపాన్ని సృష్టించాలనే దృక్పథంతో క.శ‌‌.ప ను సృష్టించి ఉంటారని అనుకుంటున్నాను.

క.శ.ప నియమాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. ఈ ప్రక్రియలో కథ ఒక కథానాయకుడు (బుంగి )చేత ఇంకో పాత్రతో , అంటే ఒకరకంగా మనతో చెబుతున్నట్లు తలపిస్తుంది. కథల్లో మనము లీనమై, బుంగీతో మాట్లాడుతున్నట్టు, కాస్త తెలంగాణ యాసను జోడిస్తూ రచయిత చిట్టి చిట్టి కథలతో, శతక పద్యాలతో క.శ.పను అల్లారు. పుస్తకం మొత్తాన్ని చూసుకున్నట్లైతే ఇందులో మొత్తం 117 కి.శ.ప లు రాయబడి ఉన్నాయి. వివిధ శతక కవులను పద్యాలను పరిచయం చేస్తూ తెలుగు జాతికి తెలియని శతకకవులును కూడా పరిచయం చేశారు రచయిత.

నియమాలు ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఎనిమిది నియమాలున్నాయి.

1)ముందుగా మనం ఒక కథను అల్లుకుని, తర్వాత దానికి అనుగుణంగా ఉన్న,

2) నాలుగు పాదాలు ఉండి,

3) నాలుగో పాదం మకుటంగా రచించబడిన నీతి శతక పద్యాలను ఎన్నుకోవాలి.

4) ఇతివృత్తం ఏదైనా, ఒక అంశానికి పరిమితం అయి ఉండి, సంభాషణాత్మకంగా, రెండు పాత్రల ద్వారా కథ నడిపించాలి. అందులో మొదటిది కల్పిత పాత్ర, రెండోది స్వయంగా కథకుడే కావాలి.

5)స్వల్ప వ్యవధిలో పూర్తయ్యేలా ఉండి, 6)పద్యంలోని మూడో పాదం లోని ఏదో ఒక పదాన్ని కథకు శీర్షికగా పెట్టాలి. ఆ పదం కథలో ఎక్కడైనా ఉపయోగించి ఉండాలి.

7) తెలుగు లోని అన్ని శతక పద్యాలను గ్రహించి ఉండాలి.

8) పద్యం ఏ కాలానికి సంబంధించినదైనా, కథలోని అంశం, భావం కొత్తదనంతో ఉట్టిపడాలి. వాస్తవ కల్పనతో వాసికెక్కాలి.

ఇవి రచయిత కరముల నుండి జాలువారిన నియమాలు.


గడిచిన సాహిత్య తరిని పరిశీలించి చూస్తే కొంతమంది సాహిత్యకారులు కథను అల్లుకుని, దానికి తోడుగా పద్యాన్ని జతచేసి క.శ.ప ను పోలిన కథ- పద్యాలు రాసినప్పటికీ అవి ఒకే శతక కర్తనో, శతక పద్యాలనో ఎన్నుకొని రాసినవి.

వారిలో బొల్లేపల్లి మధుసూదన్ రావు గారు"తాతయ్య చెప్పిన కథలు"అనే 64 బాలల కథలకు తోడుగా 64 వేమన శతక పద్యాలను జోడించి పుస్తక రూపంలోకి వెలువరించారు.

తర్వాత బెల్లంకొండ నాగేశ్వరరావు వంటి బాల సాహితీవేత్తలు కూడా వేమన శతకంలోని నీతి సుధలను ఎన్నుకుని పురాణ కథలు, కల్పితకథలు అల్లారు. కానీ అవి ఏవి క.శ.ప నియమానుసారం రాసినవి కావు. అంతే కాకుండా 100 కథ-పద్యాలు పూర్తి ఎందులోనూ కాలేదు.


క.శ.ప కేవలం బి.వి.యన్ స్వామి గారి సాహిత్య అనుభవ కృషి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


"సిరిదా వచ్చిన వచ్చును

సలలితముగ నారికేళ సలిలము భంగిన్

సిరా దా బోయిన బోవును

కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ!"

అంటూ సుమతీ కంద పద్యాలు రాసిన శతక కర్త బద్దెన పద్యాన్ని ఎన్నుకొని బుంగితో "సిరి" క.శ.పను నడిపించారు రచయిత,

"వర్షాలు పడక దిగుబడి లేకపోవడంతో అప్పులు పాలైన ఒక రైతు పంటకు ఖర్చయినా పెట్టుబడిని తీర్చడానికి అప్పులు చేసి మరీ దుబాయ్ వెళ్తాడు. అక్కడ ఉదయం నాలుగు గంటలకు మొదలు రాత్రి 12 గంటల వరకు గొడ్డు చాకిరీ చేయించుకుని 12000 వేతనం ఇచ్చేవారని, వాటిలో తన ఖర్చులను సమకూర్చుకుని ఇంటికి 8000 పంపేవాడని తెలియపరిస్తాడు.

దీని వలన ఇంకా అప్పులు పాలవడంతో ఇక తిరిగి ఊరు వచ్చేసి అక్కడ ముప్పావు వంతు ఇక్కడ కృషి చేస్తే తన బాకీలు అన్ని తీరిపోతాయని అనిపించి బొప్పాయి, మామిడి తోటలు రెండు సంవత్సరాలు ఓపిక కృషిచేయగా తన అప్పులన్నీ తీరిపోయాయి"అని చెప్పడంతో కథ ముగుస్తుంది.

నేటి సమాజంలో రైతులందరూ పడుతున్న క్షోభ ఇదే. కనికరించని వరుణదేవుడు వల్లో, రసాయనాల వల్లో పంట సరిగ్గా దిగుబడి కాక అప్పుల పాలవుతున్న రైతులు బయటి దేశాలకు వలసలు పోతున్నారని రచయిత చక్కగా వివరించారు. పరాయి దేశాలు పోవడం కంటే ఉన్న ఊళ్లోనే గొప్ప సంకల్పంతో కృషి చేస్తే సిరి దానంతట అదే వస్తుందని తెలిపారు.


"పట్టు పట్టరాదు పట్టి విడువరాదు 

 పట్టెనేని బిగియ పట్ట వలయు

పట్టు వినుట కన్నా పడి చచ్చుటే మేలు

విశ్వదాభిరామ వినురవేమ!"

అంటూ వేమన పద్యం లోని సారాన్ని ఉదాహరణగా తీసుకొని నవ్వు తెప్పించే ఎలుక కథ ఒకటి భలే వివరించారు రచయిత. ఈ పట్టు కథను చదువుతున్నంత వరకు కథలో ఆ రెండో వ్యక్తి ఎవరు? బహుశా దెయ్యమా? అన్నట్టు తలపిస్తుంది మనకు." చివరికి గోడపై కనబడిందది. కర్రతో బలంగా కొట్టిన. చచ్చి పడింది ఎలుక" అని ముగించడం తో ఈ కథలో రెండో పాత్ర ఎలుకదా? అని తెలియడంతో ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది ‌. నవ్వులాగవు అసలు ఈ కథ చదువుతున్నంత సేపు.


"ధనము గలుగు చోట ధర్మంబు కనరాదు

 ధర్మం ఉన్న చోట ధనము లేదు

 ధనము ధర్మమున్న మనుజుడే ఘనుడురా

లలిత సుగుణ జాల! తెలుగు బాల!"

-జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తమ తెలుగు బాల శతకం లో రాసిన చక్కటి పద్యం ఇది.

ఈ క.శ.ప శీర్షిక "ధనము.. ధర్మము".


"వ్యాపారం కొత్త దారులు తొక్కుతున్నది"బుంగి అన్నడు.

"నిజమే డబ్బే సరుకుగా వడ్డీ వ్యాపారం జరుగుతుంది". ఈ రెండు సంభాషణలు నేటి కాలంలో వడ్డీ వ్యాపారం ఎలా గంతులేస్తుంది తెలుస్తుంది. ఒకప్పుడు షావుకార్లు ప్రజల అవసరాల కోసం డబ్బులు ఇచ్చి తమ కొట్టును నడిపే వారిని. ఇప్పుడు ప్రజల అవసరాలు ని లాభంగా చేసుకుని గోల్మాల్ చేస్తున్నారని అంటాడు బుంగి.

కథలు ఇలా సంభాషణ కూడా జరుగుతుంది-

"ఆనాటి వ్యాపారులకు తాము జనం వల్ల బ్రతుకుతున్నాము అనే స్పృహ ఎక్కువగా ఉండేది. ఈనాటి వాళ్లు మా వల్లనే జనం బ్రతుకుతున్నారు అనే అహం లో ఉన్నారు"అంటూ లేచి వెళ్ళి పోతాడు బుంగి.

అలా లేచి వెళ్లిపోవడంలో సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అసహనం మనకు తీక్షణంగా కనపడుతుంది. ఎందుకంటే బుంగి నిజాయితీ కలిగిన వ్యక్తి.


"మాటలు యీటెల వంటివి

దాటినచోనవి పెదవి ధాటిగ వచ్చున్

మాటే ప్రాణ నమంబుగా

మాటలు మాట్లాడు మంచి మన్నన మురళీ!"

అంటూ పబ్బ మురళి తన మురళి శతకంలో నుంచి గ్రహించబడింది.


ఈ కథలో ఒక వ్యక్తి ఇంటర్వ్యూ కి వెళ్లి నీకు నచ్చిన రచయిత పేరు చెప్పమంటే తప్పకుండా వస్తాడు. సాహిత్య విద్యార్థి అయ్యుండి కూడా సమాధానం ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు.

"పుస్తకం చదవడం, పరీక్షరాయడం, మార్కులు కొట్టేయడం ఇదే నాకు తెలుసు"అంటూ సమాధానం ఇస్తాడు.

తర్వాత కాస్త చిరాకు వ్యక్తం చేస్తాడు.

ఈ క.శ.పను జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ

పై మాటలు ప్రస్తుత విద్యార్థుల చదువులను తెలియజేస్తున్నాయి. పాఠాలు చదవడం, పరీక్షల్లో వాటికి అనుగుణంగా వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయడమే కానీ అందులో ఉన్న సారాన్ని, ముఖ్య ఉద్దేశాన్ని నేటి విద్యార్థులు ఎవరు గ్రహించడం లేదని చేదు నిజాన్ని వ్యక్తపరుస్తున్నారు రచయిత.

ఇలాంటి కథలు మరెన్నో ఈ ఈ కథ శతక పద్యంలో నిక్షిప్త పరిచి ఉన్నాయి. ఇవి కేవలం పిల్లల కోసం రాసిన ఏమి కాదు. ఒక సామాజిక దృక్పథంతో, సమాజంలో చోటు చేసుకుంటున్న దుర్గతులను తెలియపరచాలని సదుద్దేశంతో రాసిన క.శ.పలు. ఇవి అన్ని తరాల వారికి ఉపయోగకరం. అందరూ ఆచరణీయ కరం.

కథలు చదువుతూ పద్యాలు నేర్చుకోవడం ద్వారా మన తెలుగు భాషను కాపాడుకుని నట్లు అవుతుంది, మన జ్ఞాన భాండాగారాన్ని మరింత మెరుగ్గా, నైతిక విలువలతో కూడా మెలగడమూ తెలుస్తుంది. రచయితలందరం ఈ క.శ.పను అనుసరించి మన తెలుగు వారసులకు గొప్ప బహుమతిని అందిద్దాం. తెలుగు వాణి(శతకపద్యాలు, నీతి శతక పద్యాలు) వినిపించి తెలుగు వారిని తెలుగు వాళ్ళగా మలచి ధన్యులుగా జీవించేలా చేద్దాం. భవిష్యత్తులో తెలుగు భాషా మహోన్నతంగా విలసిల్లాలని ఆశిద్దాం. మరోమారు రచయిత కృషికి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేం.


పుస్తక సమీక్షలు-4


#మొలక_న్యూస్


0609.2020.


🌱🌱80వ రచనా ప్రచురణ 🌱🌱

14, జులై 2021, బుధవారం

సరికొత్త ఆవు - పులి కథలు - గరిపెల్లి అశోక్

 ➤➤   నీతుల పరిమళాలను మోసుకొచ్చే
సరికొత్త ఆవు పులి కథలు 





పుస్తక సమీక్షకుడు:-  

లిఖిత్ కుమార్ గోదా.  

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్

ఫోన్:- 9640033378

••••••••••••••••••••••••••••••

తరం పిల్లలకు  కథలంటే మనం ఏం చెబుతున్నాం. హ్యారి పోటర్ కథలు, జంగిల్ బుక్ కథలు, ఆనిమేటెడ్ కథలు, కార్టూన్లు, ఫిక్షన్ కథలు చూపిస్తూ పిల్లల్ని పుస్తకాలకు దూరం చేస్తున్నాం. పిల్లలు చేతులకు పెద్దలే మొబైల్ ఫోన్లను సంకెళ్ళుగా తొడుగుతున్నారు. ఈతరం బాల్యం ఫోనులకు బానిస. ప్రస్తుతం ఉన్న తెలుగు బాలసాహిత్యంలో  రాజులు, రాజ్యాలు, దెయ్యాలు, ఊహా కథలు ఇలా ఒకే మూసలో కొంత శాతం రాయడం,రచన కొనసాగడం వలన చదివే పిల్లలకి ఎక్సైట్మెంట్ , శాటిస్ఫెక్షన్ కలగడం లేదు. ఎప్పుడూ అదే మూసలో రాయడం వలన బోర్ ఫీలింగ్ కలుగుతుంది చదివే పాఠకునికి. పిల్లలు గానీ పాఠకులు కానీ రచయితల నుంచి కొత్తదనాన్ని కోరుకుంటారు. ఎప్పటికప్పుడు సాహితీవేత్తలు కొత్త కొత్త ఆలోచనలకు, చూసిన సంఘటనలకు కొత్త తోవలో అక్షర రూపాలను ఇస్తే చదివే పాఠకుడిలో రిఫ్రెషనస్ కలుగుతుంది. మనం రాసేది పిల్లల్లోకి చేరాలంటే, పిల్లల స్థాయిలోకి దిగొచ్చి, వారి అందమైన మనస్తత్వాలు అర్థం చేసుకుని, వాటికి తగ్గట్టుగా కథలు రాయాల్సిందే.

అనుభవం ఉన్న ప్రముఖ సాహితీవేత్తల సూచనలను బట్టి చూస్తే; ఒక రచనను రెండు విధాలుగా చెప్పొచ్చు. ఒకటి, కొత్తదనాన్నైనా చెప్పగలగాలి, రెండు ఉన్నదానినే కొత్తగా అయిన చెప్పగలగాలి. ఈ తరహాలోంచి పుట్టుకొచ్చే కథలు నిజంగా రిఫ్రెష్మెంట్ ని కలిగిస్తాయి. రచయిత గరిపెల్లి అశోక్ ఈ తరహాలోనే నడిచారని చెప్పవచ్చు. ఏ తరానికైనా బాగా తెలిసిన అనంతామాత్యుని "భోజరాజీయం"లోని మాట తప్పని ఆవు పులి కథ(పుణ్యవతి)నే తీసుకొని విభిన్న సంఘటనలను, కొత్త కొత్త కోణాలను ఆవిష్కరిస్తూ 12 కథలుగా అల్లారు. కథల్లో ఎక్కడా బోర్ ఫీలింగ్ కలగకుండా, "త్యాగం కథ నుండి మమకారం కథ" దాకా ఆసాంతం చదివేలా రాశారు. ఈ పుస్తకం చేయి పట్టి, రచయిత పిల్లల్ని మొబైల్  లోకం నుండి  అడవిలోకి తీసుకెళ్లి ఒట్టి విచక్షణనే కాదు, రచయిత బాల్య దశలో ఉన్నప్పుడు అప్పటి  రైతు జీవన స్థితిగతులను కూడా కొన్ని కథలలో చూపించారు ‌. నేను గ్రహించిన దాన్నిబట్టి ఈ కథలు గొలుసుకట్టుగా రాయబడినవి. అక్కడక్కడ కొన్ని సంఘటనలు, కొన్ని కథలతో లింక్ అప్ అయి రాయబడినై.

కథా లోకానికి అడుగులేస్తే మొదటి కథ "త్యాగం"లో, తన బిడ్డకు సుద్దులు చెప్పి,  లక్ష్మీ అనే ఆవు, ఇచ్చిన మాట ప్రకారం పులి దగ్గరికి ఆహారం కావడానికి వెళితే, చెంగు చెంగున ఎగిరి కుంటూ లక్ష్మి బిడ్డైన ఆవు దూడ, పులి దగ్గరికి వచ్చి తనను తిని, తన తల్లిని వదిలేయమని మాట్లాడిన తీరు గుండెని పిండేసినంత  పని అయితది.


సహజత్వం కథలో- అడవికి మేతకు వెళ్ళిన రమ అనే ఆవు పులికి చిక్కగా, రమా తాను బాలింతనని ఎంత బ్రతిమలాడినా కనికరించకుండా పులి రమని చంపి తినడం; ఇప్పటి ప్రపంచంలోని దుర్మార్గం, దయాగుణం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో పులి పాత్ర ద్వారా ఇలా చెబుతారు రచయిత,- " ఇది సత్యహరిశ్చంద్రుని కాలం కాదు. సత్యానికి కట్టుబడి ఉన్నారా ఎవరైనా? అలాగే ఇది కలికాలం. నాటి అసత్యమాడని పులిని కాను. ముందు ఆకలి తీర్చుకుంటా. నరకంలో శిక్షలు పడితే పడని" అంటూ కళ్లకు కట్టినట్టు చూపించారు.

"ఒకరి కోసం" కథలో, తమ తల్లుల్ని కోల్పోయిన దూడలు, పులితో; భారతి అనే ఆవుకు బదులు తమని తినమని, అమ్మల ప్రేమలకు దూరమైనా ఓ పది దాకా పసి దూడలు, ఇంకో దూడకు మాతృ ప్రేమ ఉండాలనే సదుద్దేశంతో,  తమ ప్రాణాలను త్యాగం చేయడానికి, పులి దగ్గర సిద్ధపడినప్పుడు కళ్ళు దుఃఖపునదులా మారిపోతాయి.

ఆత్మార్పణ కథలో- మల్లిక చెప్పిన మాటలు విని,నలుగురికి సేవ చేయని ఈ స్వార్థజీవితం నాకెందుకు అని పులి గుహలోంచి కొండమీదకు పరిగెత్తి మరణించడం సూక్ష్మంగా ఆలోచించాల్సిన కథ. కౄరమృగమే పశ్చాత్తాపం చెందినప్పుడు,మనుషులం మనం నిజమైన మనుషులుగా బ్రతకలేమా అని ప్రశ్నలు రేకెత్తించే కథ.

ఐకమత్యం కథలో తాను పెంచుకునే కుక్కని రామయ్య పటేలు,"తమ్ముడు" అని ఆప్యాయంగా పిలవడం మనిషిలోని మంచితనాన్ని, పెంపుడు జంతువులపై ప్రేమానుబంధాలు పరిచయం చేస్తుంది. తమ్ముడు, తన ఇతర మిత్రులైన కుక్కలతో కలిసి దొంగచాటుగా కాచుకుని ఉన్న పులిని తరమడం ఐకమత్యమే మహాబలం అని అనిపించింది.


ప్రాణదానం లాంటి ఇంకొన్ని కథల్ఊ జంతువులను, మనుషులతో మాట్లాడించిన తీరు ఆవుల్లోని విచక్షణను మనసుకు వివరిస్తుంది. ఈ ప్రయోగం మంచి ప్రయత్నంగా అనిపించింది నాకు.


చివరిగా మమకారం కథ, దుబ్బాక, మల్లారెడ్డి పేటలో జరిగిన ఓ వాస్తవ సంఘటన్నే కథావస్తువుగా తీసుకుని ఉండొచ్చు. రైతు కుటుంబం, తాము పెంచుకునే పశువులతో ఎంత గొప్ప మమకారం, ఇంటరాక్షన్ ఉంటుందో చూపిస్తారు. ఈ కథ చదువుతున్నప్పుడు పాఠశాల స్థాయిలో నేను చదువుకున్న ఓసఫ్- కన్నన్ కథ మరలా యాదికొచ్చింది. అంతటి ప్రేమానురాగాలు, గుర్తింపు కనబడింది కథలో.మొత్తానికి ఇది బహు నీతుల సమ్మేళన బాల కథా సంపుటి.


ఇప్పటి తరానికి తెలియని కొన్ని రైతు జీవన పదాల్ని రచయిత పరిచయం చేశారు. ఉదాహరణకు "తెలకపిండి,పల్లిపిండి,మత్తది అన్నం,జంగిడి" ఇలాంటి పదాలు చదివినప్పుడు మన యాస లోని మాధుర్యాలు మనసులో నిండిపోయాయి. ప్రతి కథలోనూ జానపదులు వాడే సామెతలని, జాతీయాలని ఉపయోగిస్తూ కథల్ని పల్లెటూరి వాతావరణానికి దగ్గర చేశారు. మన మూలాల్ని పదిలపరిచే విధంగా కథా రచన చేయడం వల్ల రచయితను అభినందించకుండా ఉండలేం. బుక్ హైలెట్ కోసమో, రచయితను హైలెట్ చేయాలనే ఆలోచనతో అన్న మాటలు కావివి. కేవలం కథలు చదివాక కలిగిన ఒపీనియన్ అంతే.

కొత్త కొత్త అడవుల్లోకి, కొత్త కొత్త ఆవు పాత్రలతో, వాటికి పేర్లు పెట్టి కథలు, గుండె గల్ల గురిగిలో నిండిపోయేలా రాశారు.


రచయిత గరిపెల్లి అశోక్కి పిల్లల కథల్లో ఎలాంటి ఎత్తుగడలు, ఎత్తుకు పై ఎత్తులు, కథా వస్తువులు, ఎలాంటి సంఘటనలు ఉపయోగించి పాఠకుడికి కొత్త పరిమళం కలిగేలా ఫీలింగ్ తీసుకురావచ్చో ఆ అంశాల పైన మంచి పట్టు ఉంది. కథనంతా ఎంతో రసవత్తరంగా సాగించి, మంచి టెక్నిక్ వాడుతూ, మంచి ముగింపునిచ్చే సీక్రెట్ కూడా తెలుసు. అందుకే కథల్ని ఇంత బాగా చదివేలా రాశారు. వర్ధమాన బాల సాహితీవేత్తలకు ఈ పుస్తకం బహు ఉపకరిస్తుంది. ఇలాంటి మంచి పుస్తకానికి బాలసాహిత్య లోకానికి అందించిన రచయిత అశోక్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

||14-07-2021||

6, జూన్ 2021, ఆదివారం

మది నదిలో - చిట్టే సిద్ధ లలిత

  •  గుండె మంటలను చల్లార్చే "మది నదిలో"

లిఖిత్ కుమార్ గోదా,

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం


What is poetry but the thought and words in which emotion spontaneously embodies itself.

- John Stuart mill


    మనిషి మనసులోని ఊహల నుండి, ఊసులు నుండి, నవ్వులు నుండి, తన జీవితంలో అనుభవిస్తున్న మానసిక సంక్షోభం నుండి, సామాజిక వివక్షతలనుండి, స్థితులు నుంచి, సంఘటనలు నుండి కవిత్వం పుట్టుకు రావచ్చు.

 అచేతనంగా మారిన మనుషుల మనసులను చైతన్యపరిచి ముందుకు నడిపించగలిగేది కవిత్వం.అయాచితం లేదా అయోమయం నుంచి ఆలోచించే తీరుకు కవిత్వం మనల్ని తీర్చిదిద్దుతుంది. మేను నిండా కమ్ముకున్న చీకటి మురికిని, ఎదలోతుల్లో దాకా వెళ్లి కవిత్వ డిటర్జెంట్ మాత్రమే శుభ్రపరచ కలదు. 


    కవయిత్రి చిట్టే సిధ్ధ లలిత గారి కవిత్వం కూడా కొన్ని ఊహలతో, మరికొన్ని ఆశలతో, కడుపులో నిండిపోయిన ఆవేదనతో రూపుదిద్దుకుంది. ప్రేయసి ప్రియుడు కోసం పడే ఆరాటం, అతనితో కలిసి పాడుకోవాలి అనుకుంటున్న విరహ కవిత్వాలు ఇందులో విరివిగా ఉన్నాయి. ఇందులో కొన్ని కవితలు మాత్రం "మనీషి" కోసం ఆరాటపడుతున్నాయి. కవయిత్రి కవితలు చదివిన తర్వాత ఒక అభిప్రాయం కలిగింది. తాను చెట్టులా, ప్రకృతిని ఆస్వాదించుకుంటూ కవిత్వాన్ని అల్లుకున్న తీరు బావుంది.



       కవయిత్రి అది ఇది అని కాకుండా అన్ని వర్గాల కవిత్వంలో అడుగు పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇందులో స్త్రీ వాద కవిత్వం తక్కువే అయినప్పటికీ అవి మన పై చూపించే ప్రభావం కొంచెం ఎక్కువే.


★స్త్రీ చరిత్ర


తరతరాల స్త్రీ చరిత్రను

తరచి చూసావా...

ఆమె ఎదుర్కొన్న వివక్షతను

గమనించావా..

అసమానతలతో...

తన ఉనికిని పోగొట్టుకున్న వైనాన్ని

పరికించావా...

మొన్నటివరకూ.. ఆడపిల్ల..

చదవకూడదు.. నవ్వకూడదు... గడపదాటకూడదనే ఆంక్షలతో అణచివేయబడింది..!

ఎదిగితే గుండెలమీద కుంపటన్నారు..! ఎదురుతిరిగితే బరితెగించిందన్నారు..!

ఆమె స్వేచ్ఛను హరించి... కట్టుబాట్లతో ఆమెను బందీనిచేసారు..!

అయ్యో.. ఆడపిల్ల పుట్టిందా... 

అనర్థమంటూ..

ఆడజన్మను హేళన చేసారు..!

కాలమెంత మారినా.. స్త్రీ జీవితమేమీ మారలేదు..!

ఆమె జీవనగతిలో మార్పేమీలేదు.

చదువులెన్ని చదివినా.. ఉద్యోగాలు చేసినా..

కట్నంతో మొగుడ్ని కొనుక్కునే

దుస్థితిలోనే ఉందామె..!

అవును.. ప్రస్తుతం..

స్త్రీ ఎంతో అభ్యున్నతిని సాధించింది..!

ఇప్పుడు ఇంట్లోనే కాదు

బయట కూడా

ఉద్యోగం పేరుతో చాకిరీ చేస్తుందామె..! అంతే తేడా.!!(పేజీ నెం.71)

         "స్త్రీ చరిత్ర" అన్న శీర్షికతో రాసుకున్న ఈ కవిత, ఇప్పటికి అక్కడక్కడా కొనసాగుతున్న స్త్రీలపై పురుషాహంకారాన్ని వెల్లడిస్తుంది. ఇప్పటికీ స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షతను, అణిచివేతలను వివరిస్తుంది. కాలం ఎంత మారినా స్త్రీ జీవితం ఏమీ మారలేదు అంటూ చదువులెన్ని చదివినా ఉద్యోగాలు చేసిన కట్నంతో మొగుడ్ని కొనుక్కునే దుస్థితి ఉందని ప్రెసెంట్ సోషల్ ఇష్యూ తీసుకుని రాసిన వాక్యాలు బాగున్నాయి. ముగింపులో "అవును ప్రస్తుతం స్త్రీ ఎంతో అభ్యున్నతిని సాధించింది అంటూ రాసినా, ఉద్యోగం పేరిట ఆమె చాకిరీ చేస్తుందని" చెప్పారు.


★సారీ..


నేను.. చాలా.. బిజీగా.. ఉన్నాను . నన్ను.. డిస్టర్బ్ చెయ్యవద్దు. వెలిసిపోయిన జీవితానికి..

రంగులద్దుకుంటున్నాను. శిథిలమైన.. నా..

జీవనసౌధాన్ని

పునఃనిర్మించుకుంటున్నాను..!!"(పే.నెం:28)

ఈ కవిత కొంచెం హార్ట్ టచింగ్ గా అనిపించింది. గొప్ప అర్థం ఇందులో ఉంది. మహాకవి శ్రీ శ్రీ అన్నట్టు "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా" అన్న తరహాలో ఉన్నట్లు అనిపించింది. "ఎవరు మన జీవితాన్ని బాగు చేయరు, మన కష్టాల్ని మనమే ఎదుర్కోవాలి. చినుగులు పడ్డ మన జీవితాలకు మనమే కుట్లు వేసుకోవాలి" అని అర్థం ఇచ్చే కవిత.


"సమస్త మానవాళి.. ఒకవైపు

 కారణం లేకుండా... కక్షగట్టి..

కదనానికి కాలు దువ్వే

కరోనా అటువైపు..."

కదన రంగం పోయెం(పేజీ నెం.38)లో ప్రపంచ మానవాళిని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్ పై కలం తుపాకీ ఎక్కుపెట్టిన తీరు బావుంది.చక్కని కంటెంట్ తో కరెంట్ ఇష్యూని తీసుకుని మనోధైర్యాన్ని రేకెత్తించేలా రాశారు కవయిత్రి.ఈ కవిత చదివాక వీరిది స్పందించే హృదయం అని అర్థం అయ్యింది. గొప్ప పోయెట్రీకి ప్రాణాన్ని ఇచ్చేది స్పందించగల హృదయమే.


★అమ్మ


పచ్చటి పూదోట మా అమ్మ!

ఆత్మీయతల కొమ్మలతో..

అనురాగపు రెమ్మలతో.. అనుబంధాల తీవెలతో..

అందంగా అల్లుకున్న పొదరిల్లు మా అమ్మ! వేకువ చుక్క మా అమ్మకు నేస్తం...

అమ్మతోపాటూ.. కళ్ళు నులుముకుంటూ...

నిద్రలేస్తుంది మరి! 

మా అమ్మ కునుకుతీసాకే...

చంద్రుడు.. చుక్కలతో కబుర్లు చెప్పేవాడు! 

మా అమ్మ పాదాల అలికిడికి లేచిన తొలికోడి...

కొక్కొరొకో అంటూ.. సుప్రభాతాలు వినిపిస్తుంది!

మా ఇంటిముంగిట ముగ్గును చూడాలనే.. సూర్యుడు పక్కదులుపుకుని పైకొచ్చేవాడు..!

లాలిపాటలు.. జోలపాటలు

మా అమ్మ స్వరంలో ప్రవాహాలే..! కలతైనా.. కంటినలతైనా...

కష్టాన్ని పమిటచెంగుతోనే పంచుకునేది మా అమ్మ!

గడప దాటడం కంటే.. తలుపుచాటునే.. ఇష్టపడేది..

ఓర్పుకు మారుపేరు...

సహనానికి మరోరూపు... శ్రమించడంలో..

క్షమించడంలో భూమాత.. 

నా విశ్వమంతా నిండిపోయిన

అమ్మకు నా వందనం!!(పే.నెం.:74)


అమ్మ గురించి ఎన్ని కవితలు చదివినా మనసుకు విసుగు రాదు. పల్లెటూరు వాతావరణం లో ఉండే అమ్మల ప్రేమలు అసామాన్యం. బహుశా కవయిత్రి పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చి ఉండొచ్చు. "అమ్మ" అనే శీర్షికతో రాసిన ఈ కవిత రోజూ చూసే అమ్మను గురించి సాధారణంగా చెప్పినా కొంచెం కొత్తగా రాసే ప్రయత్నం చేశారు. ఇందులో వేకువచుక్క అమ్మకు నేస్తం అని అమ్మ తో పాటే కళ్ళు నులుముకుంటూ నిద్ర లేస్తుంది అని, వాళ్ళ అమ్మ కునుకు తీసాకే చంద్రుడు చుక్కలతో కబుర్లు చెప్పే వాడిని, వాళ్ళ అమ్మ పాదాలు అలికిడికి లేచిన తొలికోడి కొక్కొరొక్కో అంటూ సుప్రభాతాలు వినిపిస్తుందని, కవయిత్రి ఇంటి ముంగిట ముగ్గును చూడాలనే, సూర్యుడు పక్క దులుపుకొని పైకి వచ్చేవాడని చెప్పిన తీరు బాగుంది.


★పేజీలు (పే.నెం: 84) కవితలో

"జీవితమనే పుస్తకంలో

 మొదటి పేజీని నేను..

 చివరి పేజీవి నువ్వు..

మధ్య పేజీలలో..

నాకు నువ్వు.. నీకు నేనుగా

మనిద్దరమే.. కదా.‌"

అంటూ రాసిన ప్రేమ కవిత గుండెను ఆకట్టుకుంది. ఇందులో ఎన్నో ప్రేమ కవితలు ఉన్నప్పటికీ ఇది కొంచెం గుండెని రీచ్ అయింది.


అన్నదాతా సుఖీభవ (కవిత పేజి నెం: 41) అంటూ రాసిన కవితలో రైతన్నా నీ గురించి నాలుగు వాక్యాలు నన్ను రాయమన్నారు అని అంటూ కవితలో పొందికగా రైతు ఎంత కష్ట పడతాడో చెప్పకనే చెప్పారు.


     "కవిత్వమొక హృదయగానం. ఎవరికి వారు ఎంచుకోవాల్సిన, వారికే సొంతమైన, సౌందర్య దారి. ఎవరి దారి వారిదే" అన్నాడు ఓ కవి. మొత్తంగా లలిత గారి కవిత్వం పేజీకి మించకుండా, తక్కువ పంక్తులతో అల్లుకున్న ఊహా వాక్యాలు, కన్నీటి పద్యాలు గుండెను హత్తుకున్నాయి. ప్రకృతిని కవితా వస్తువుగా తీసుకొని మనిషి జీవితాన్ని ఆవిష్కరించడం ఈ సంపుటికి కొంత ప్లస్ పాయింట్. కొన్ని కొన్ని కవితలు పరిశీలిస్తే వాటిలో పరమార్ధాలు చాలా మటుకు మనిషి ఉన్నతినే ఆకాంక్షిస్తున్నాయి. దాదాపు 180 కి పైగా కవితలున్న ఈ సంపుటి మనసుకు కాస్త రిఫ్రెష్మెంట్ కలిగిస్తుంది. కవితలన్నీ చదివాక మది నదిలో పడి మలినాన్ని పోగొట్టుకొని, కాస్తంతా పచ్చటి ఊపిరిని పీల్చుకున్నంత ఫీలింగ్ కలిగింది. కవితలను తన తరహాలో, తనదైన శైలిలో, తనదైన వాక్యాలు రాసుకున్న కవయిత్రి లలిత గారికి అభినందనలు.


06/06/2021