29, నవంబర్ 2020, ఆదివారం

అక్షర జలపాతాలు - మామిడి రమేష్


29, నవంబర్ 2020, ఆదివారం

హరివిల్లు నూతన లఘు కవితా ప్రక్రియ సృష్టికర్త శ్రీ మామిడి రమేష్ గారి తొలి హరివిల్లు పుస్తకం"అక్షర జలపాతాలు" పుస్తకంలో నేను రాసిన ముందు మాటలు...

⇉ కదిలించే కవనాలు... "హరివిల్లు"ల అక్షర జలపాతాలు




రి ముందుకు నడుస్తున్న కొద్దీ తెలుగు సాహితీవనంలో కొత్త కొత్త మొలకలు, మొక్కలు ఉద్భవిస్తూ కవన పరిమళాలను, కిరణాలను వెదజల్లుతున్నాయి.

తెలుగు భాషా ఘనతను సుస్థిరంగా నిలపాలనే ఆశయంతో, కవిత్వాన్ని సాధారణ జనుల రసన వద్దకు తీసుకెళ్లి, కవిత్వంపై మక్కువ కలిగేలా చేసి, పాఠకులు సైతం కవి కావాలనే ఉద్దేశంతో, కవులు తమ సృజనకు పదును పెట్టి నూతన కవితా ప్రక్రియలకు పురుడు పోస్తున్నారు. "అచ్చంగా తెలుగు" ఇంపును, నుడికారాలను, అతి తక్కువ పాదాల్లో, మాత్రాఛందస్సును, అంత్య ప్రాస నియమం పాటించడం, అలంకారాలను కవిత్వంలో చొప్పించి చిక్కగా, తేనె చుక్కగా అందరూ రాయాలనే నూతన కవితా ప్రక్రియలకు శ్రీకారం చుడుతున్నారు రూపకర్తలు.

అలాంటి కొద్దిమంది కవుల్లో హరివిల్లు కవితా రూపకర్త శ్రీ మామిడి రమేష్ గారిని ఒకరని చెప్పుకోవచ్చు.


ఈమధ్యే రూపుదిద్దుకున్న కైతికాలు, మణిపూసలు, చిమ్నీలు, మెరుపులు వంటి నూతన కవితా ప్రక్రియల రుచిని చూసిన రమేష్ గారు తమ వంతు తెలుగు కవిత్వం కోసం, బడిలో చదువుకునే విద్యార్థుల నుండి, తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉన్న ప్రతి వ్యక్తి కోసం ఈ హరివిల్లు ప్రక్రియను రూపొందించారు అని నా అభిమతం. అతి తక్కువ కాలంలోనే వాట్సప్ వేదికగా అన్ని వయసుల వాళ్లు కలిపి దాదాపు రోజుకు రెండు వందల మందికి పైగానే ఈ సమూహంలో హరివిల్లు కవిత్వం కురిపిస్తున్నారు. అతికష్టమైనా, ఎంతో శ్రద్ధతో వాళ్లల్లో విజేతలను ఎన్నుకుంటున్నారు నిర్వాహకులు.


ఈ "అక్షర జలపాతాలు" లోని హరివిల్లు కవనాలు ప్రతి ఒక్క చదువరిని కవిత్వంతో తడిపేస్తాయి. 160 హరివిల్లులతో అలంకరించిన ఈ వయ్యి సంపూర్ణంగా జనాదరణ పొందుతుందని ఆకాంక్షిస్తున్నాను. నాకున్న వీలునుబట్టి ఇందులోనే చిక్కని కవిత్వాన్ని మీ మదికి చేరవేసే యత్నం చేస్తాను.


" సహనశీలి మగువ

  సమరభేరి మగువ

  ఇంటి వెలుగు మగువ

  ఇలన కాంతి మగువ"(16)-

అంటూ లక్ష్మీబాయి, రుద్రమదేవి వంటి మగువలు చేసిన పోరును, మగువలకు ఉన్న గొప్ప లక్షణాలను, ఒక్క హరివిల్లు లో పొందుపరిచారు.

" చలికి వణికి నపుడు

  చెద్దరగును అమ్మ

  అలసిపోయినపుడు

  ఊయలగును అమ్మ"(30)

- అంటూ అమ్మ అవ్యాజమైన ప్రేమ గురించి గొప్పగా వివరించారు.44వ హరివిల్లులో అటు కలియుగంలో జరుగుతున్న నిజాన్ని తెలియపరచి, అమ్మ దివ్యమైన గొప్పతనాన్ని చాటి చెప్పారు."

  

  మాట చెలిమినిచ్చు

  మాట కలిమినిచ్చు

  మాట సమత నిచ్చు

  మాట మమత నిచ్చు"(67)

 మాట ఎంత మహత్తరమైన కార్యాలను చేయగలదో, ఎంతటి ప్రేమానురాగాలను కురిపించగలదో వివరించారు.


" మాతృ భాష లోని

  మకరందం వీడకు

  పరుల భాష యొక్క

  పంచన చేరకు!"(84)

అంటూ మాతృభాషలోని ప్రేమానురాగాలను భోధిస్తూనే, పరుల భాష చెంత చేరకు అని, పరభాష నేర్చుకోవడం వరకేనని చదువరులకు చెబుతున్నారు.


నాన్న ఆప్యాయత, గురువు విశిష్టత, చెలిమి, చెట్టు విశిష్టతలు వెల్లడించారు కవి అపురూపంగా.


"నొసటి రాత రాయు

అసలు బ్రహ్మ ఓటు

  బతుకు బాగు చేయు

  బల సూత్రం ఓటు!"(102)

- అంటూ ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూనే, రాజకీయవేత్తలు ఎంత జిత్తులమారులో,కుటిల బుద్ధిగలవారో,కుంటి సాకులు వినిపిస్తారో తరువాతి హరివిల్లు కవితల్లో చూపించారు.


దేశానికి అమ్మై అన్నం అందించే రైతన్న గురించి-

" మెతుకులిచ్చు వాడు

  చతికెలపడే నేడు

  అతీగతీ లేక

  చితికి చేరెను చూడు!" (113)

అంటూ తన కవి హృదయ వేదనను కవిత్వకరించారు కవి.


"మనిషి పైన చేసే

 మారణ హేలల దాడి

 మందుగిందు లేని

 కరోనా మాయలేడి"-(119)



ప్రస్తుతం మూడవ ప్రపంచ యుద్ధంగా మారిన కరోనా మహమ్మారి పై తన క(ల)రవాలాన్ని సంధించారు.


ఆస్వాదించాలే కానీ ఇందులోని నూట అరవై కవితలు ప్రతి పాఠక ప్రియుడిని తేనె టీగలా మార్చి "హరివిల్లుల మకరందాన్ని" రుచి చూపించగలవు.

మానవత్వం,సమాజ హితం, నడకను, ఆలోచనా శక్తిని, విలువల్ని, విచక్షణని, మానవీయ బంధాలు ఇలా మానవ జీవితంలో ఆవశ్యమైన ప్రతి విషయాన్ని తీసుకుని అతి తక్కువ పదాలతో, పాదాలతో చక్కని కవిత్వాన్ని రాసి పాఠక లోకానికి అందించడంలో కవి సఫలీకృతులయ్యారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కవి రమేష్ గారు మున్ముందు నిత్య నూతనమైన హరివిల్లుల కవిత్వాన్ని తెలుగు పాఠకు ప్రియుల అరచేతుల్లోకి తీసుకెళ్లి వారి హృదయ గ్రంథాలయంలో జీవించ గలరని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి మనోరంజక పుస్తకాన్ని వెలువరించిన రమేష్ గారికి అభినందనలు.


✍️ లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ,

మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్.


బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202

22, నవంబర్ 2020, ఆదివారం

పాలబుగ్గలు పసిడి మొగ్గలు: - వేంపల్లి రెడ్డి నాగరాజు

 స్వర్గీయ, ప్రముఖ సాహితీవేత్త రెడ్డి నాగరాజు వేంపల్లి గారు రచించిన "పాల బుగ్గలు పసిడి మొగ్గలు" పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 

నీతి కథల చిట్టడవి... రెడ్డి నాగరాజు"పాలబుగ్గలు పసిడి మొగ్గలు"(పుస్తక సమీక్ష)


10, నవంబర్ 2020, మంగళవారం

నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు - ఉప్పల పద్మ

 నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 బాలల అక్షర సేద్యం... నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు(పుస్తక సమీక్ష)


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.






హాయ్ నేస్తాలూ! ఎలా ఉన్నారు.నేను మీ మోనిస్.."లిఖిత్ కుమార్ గోదా"ని. నవంబర్ 14 న మన పండుగ సందర్భంగా మీకోసం మన నేస్తాలు రాసిన ఒక పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. పుస్తకం పేరేమిటో చెప్పనా? "నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు". మరి ఆ పుస్తకం విశేషాలేంటో చూద్దామా!


"అచ్చటికిచ్చటి కనుకోకుండా

 ఎచ్చటెచ్చటికో ఎగురుతుపోయే

 ఈలలు వేస్తూ ఎగురుతుపోయే

 పిట్టల్లారా!

పిల్లల్లారా!!..."



 "శైశవగీతి"లో మహాకవి శ్రీశ్రీ కల్లా కపటం ఎరుగని బాలల గురించి చెప్పిన కవిత ఇది. నిజమే పిల్లలు పక్షుల లాంటివారు. ఏ చోటకైనా, ఎక్కడికైనా కేరింతలు పెడుతూ విహరించగలరు. వారు ఉన్నచోటునే పూదోటగా మలచగలరు. ఆనంద లోకాన్ని సృజించగలరు. బాలలు తలచుకుంటే నిండు మనసుతో ఏ పనైనా ఇట్టే ఆకళింపు చేసుకుని, ప్రీతితో చేయగలుగుతారు. అలా వారి అభిలాషకు అక్షరాల రంగులద్ది చక్కని ,చిక్కని కథలు రాశారు నల్లగొండ జిల్లా బడి పిల్లలు. అలా మన తుంటరులు రాసిన కథలను ప్రముఖ పరిశోధకులు, సంపాదకురాలు శ్రీమతి ఉప్పల పద్మ గారు భగీరథ దీక్షతో పుస్తకంగా మనముందుకు తీసుకువచ్చారు.


ఈ పుస్తకంలోని కథల గురించి చెప్పుకునే ముందు ఈ పుస్తకానికి ప్రాణం పోసేలా చేసిన బాల వదాన్యుడు చిరంజీవి శ్రీ రిషి వర్షిల్ నెలకుర్తి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.

పుస్తక పఠనం ఆవశ్యకత తెలిసి, తన వయసులోని ప్రతిభావంతులైన పిల్లల్ని ప్రోత్సహించాలనే సత్సంకల్పం కలిగి, రాబోయే నవతరం ఉత్తములుగా ఎదగాలనే లక్ష్యంతో, తాను సేకరించిన, సంపాదించిన డబ్బుతో ఈ పుస్తకాన్ని మన అరచేతిలోకి వచ్చేలా చేశాడు. చిన్నతనంలోనే దానగుణాన్ని ఇముడ్చుకున్న రిషీ వర్షిల్ నేటి తరానికి ఆదర్శప్రాయం. ఈ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని సహాయం చేయదలుచుకున్న వారు ఎందరో ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. భావి తరాన్ని రంగవల్లులతో నింపాలి.


 నలభై ఐదు రత్నాలతో నిండిన ఈ పుస్తకం విజ్ఞాన కోశాగారం వంటిది. ప్రతి కథలో నీతిని, తాము చూసిన జీవితాలకు చక్కని అక్షర రూపాన్నిచ్చారు ఈ చిరంజీవులు. పిల్లలు ఎంత బాగా చేయి తిరిగిన రచయితల్లా కథలు రాశారో, అంతే బాగా చిత్రాలు గీశారు చిత్రకారులు. చిత్రకారుల బొమ్మలతోనే కథలు మనకు అర్థం అవుతూ ఉంటాయి.

ధీరావత్ భూమిక రాసిన" ఆడపిల్ల" కథ "ఆడపిల్లలపై ఇప్పటికీ జరుగుతున్న వివక్ష"పై రాసిన చక్కటి కథ. గంగ వాళ్ళ ఊర్లో ఒక దెయ్యం ఉండడం, ఆ దెయ్యం అందర్నీ భయపెడుతుందని ఊరి వాళ్ళు చెప్పుకుంటే గంగ వినడం, ఆ దెయ్యాన్ని చూడాలని ఒక రాత్రి కుతూహలంతో అడవికి వెళ్లి ఆ దెయ్యాన్ని కలవడం, ఆ దెయ్యం తానొక ఆడపిల్లనని. తన తల్లిదండ్రులకు ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో చిన్నదైనా తనను చంపడంతో తాను దెయ్యం అయ్యానని చెప్పడం, ఆడపిల్లని ఎవరూ చంపకూడదనే సదుద్దేశంతో ఆ చుట్టుపక్కలే సంచరిస్తున్నాని చెప్పడం, ఆడపిల్లల్ని ఎవరిని చంపనివ్వకుండా నేను చూస్తాను అని గంగ హామీ ఇవ్వడం, గంగ ఊరి వారిని మార్చే ప్రయత్నం చేయడంతో కథ సుఖాంతమవుతుంది.


వట్టికోట గాయత్రి తన "అసలైన కొడుకు" కథలో. వర్తమాన సమాజాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసింది. కన్నవారినే కాదనుకునే కొడుకులు ఉన్న ఈ రోజుల్లో , తనకేమీ కానీ రాజవ్వకు కుండపోత వర్షం పడుతున్నప్పుడు రమేష్ ఆశ్రయం ఇవ్వడం, తనను కాదన్న కొడుకులు తనకోసం, తన ఆస్తి కోసం వచ్చినా, రాజవ్వ మాత్రం రమేష్ ని తన నిజమైన కొడుకు గా భావించడం పాఠకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది.


"కొడుకైనా కూతురైనా ఒకటే" కథను తొమ్మిదో తరగతి విద్యార్థిని సుంకర ఉదయశ్రీ చాలా చక్కగా రచించింది.

"మట్టి గణపతి" కథలో పర్యావరణ హితాన్ని కోరి శ్రీవర్ధన్ మంచి కథను అందించాడు. నిజంగా ఇలాంటి మార్పులు పల్లె నుండి మొదలవడం ఆవశ్యకం.

"మార్పు" కథ భలే తమాషాగా సాగుతుంది. నిజంగా ఒక చెయ్యి తిరిగిన రచయితలా కథను లిఖించింది రమ్య చెల్లి. కథ చదువుతున్నంత సేపు కూడా పిసినారిని నిజంగా కళ్ళకు కట్టినట్లు చూపడం, వైద్యుడు పిసినారిని గ్రహించి తెలివిగా వ్యవహరించడం, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడం అందరి మనసులను దోచుకుంటోంది.


పాటి భానుజ "స్నేహం గొప్పతనం", శ్రీవిజ"ఐక్యమత్యమే మహాబలం", భవాని "భయం కలిపిన స్నేహం", మరికొన్ని కథలు స్నేహం గొప్పతనాన్ని చాటుతాయి.

"ప్రాయశ్చిత్తం" కథను రాసిన వైష్ణవి సమకాలీన జీవితానికి అద్దం పట్టేలా రచించింది.


శివమణి "తెలివితక్కువ పని" కథను ప్రశంసించకుండా ఉండలేం. అంత చక్కని కథ.


పావని "చిన్నప్పుడే" కథ, సాహితీ "గురుదక్షిణ" కథలు చదువరులను ఆహ్లాదపరుస్తాయి. మంచి నైతికాలను అందిస్తాయి.

"కోటిలింగాలు" కథ రాసిన శ్రీకర్ చాలా చురుకైన ఆలోచనతో అతి జాగ్రత్త ఉంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వివరించాడు.


"నాన్నా తాగకు", "మారిన మనిషి" మద్యపాన వ్యసనమున్న తండ్రులను ఎలా మారుస్తారో వివరించిన కథలు.

ఇలా చెప్పుకోవాలే కానీ, అన్ని బాల రచయితలు తమ స్థాయికి మించి సృజనకు పెద్దపీట వేశారని చెప్పుకోవాలి. అక్కడక్కడ కొందరు బాల రచయితలకు హృదయాల నిండుగా అమలిన ప్రోత్సాహం అందిస్తే సాహిత్యంలో తిరుగులేకుండా ఎదగగలరని నా అభిప్రాయం.


తెలుగు బాల సాహిత్య పుటల్లో ఇంతటి మహత్తర కరదీపికను ఎంతో దీక్షతో, శ్రమపడి వెలువరించిన సంపాదకురాలు ఉప్పల పద్మ గారికి అభినందనలు. అలాగే నవతరం నూతన రచయితలు చక్కని కథలు రాసినందుకు ఇవే నా శుభాభినందనలు. అలాగే అందరూ ఆదరించదగ్గ నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు వయ్యిని మన హృదయ గ్రంథాలయం లో పొందు పరచుకునేలా చేసిన, పాఠశాల ఉపాధ్యాయులు , సహకరించిన తల్లిదండ్రులు, చిరంజీవి రిషి వర్షిల్ అభినందనీయులు. 


గోరుముద్దలు - వేంపల్లి రెడ్డి నాగరాజు

 

ప్రముఖ సాహితీవేత్త వేంపల్లి రెడ్డి నాగరాజు రచించిన గోరుముద్దలు కథల సంపుటి పై నేను రాసిన పుస్తక సమీక్ష

లేత మనసులకు నూతన నేస్తాలు... రెడ్డి నాగరాజు "గోరుముద్దలు"


బాలసాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు మొలకెత్తినా పిల్లలకు విలువలు, నీతిని, చైతన్యాన్ని నేర్పేది మటుకు కమ్మని కథలే. వయసురీత్యా పెద్దలైనా, పిల్లల్లో జాగృతి కోరి, భావి తరానికి బలమైన పునాది వేయాలని అంకితభావంతో , పిల్లల వయస్సుకు దిగొచ్చి, వారికి అర్థవంతంగా, వారు మాట్లాడుకునే భాషలోనే, కథను అందరిలా(కొందరు రచయితలు) చెబుతున్నట్లుగా కాకుండా, కథను కళ్లముందు చూపిస్తూ జరుగుతున్నట్లు రాయడం, ఆ కథల్లో చదువరి బాలలే ఉన్నట్లుగా రాయడం, పరిస్థితుల రీత్యా సమకాలీన జీవనానికి అద్దం పట్టేలా కథలు అల్లడం బాల సాహితీవేత్తలకు కత్తి మీద సాము లాంటిది.




కానీ పరిశుభ్రమైన, పరిపూర్ణమైన సమాజం ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలనే సత్సంకల్పం ఉన్న రచయితలకు మాత్రం పైనున్న మాటలు "వెన్నతో పెట్టిన విద్య"ని చెప్పాలి.




రచయిత వేంపల్లి రెడ్డి నాగరాజు గారు వృత్తిరీత్యా ఎల్ఐసి ఉద్యోగి అయినప్పటికీ, సాహిత్యానికి తరగని విజ్ఞాన, నీతుల కోశాన్ని అందించాలనే సులోచనతో కథా,కవిత,ఇతర సాహిత్య ప్రక్రియల్లో తమ ఎనలేని అక్షర సేద్యాన్ని, సంపదను అందిస్తున్నారు.తన కలం నుండి వెలలేని సాహిత్యాన్ని ఇస్తున్నప్పటికీ ఇంకా ఏదో అందించాలనే తాపత్రయం. ముఖ్యంగా పిల్లల జీవితం మలినం లేని సమాజంలో తిరుగాడలనే లక్ష్యంతో బాల సాహిత్యంలో కూడా నూతన ఒరవడి ఆలోచనలతో, ప్రయోగాలతో నిరంతరం కృషి చేస్తున్నారు.




  గత ముప్పయేళ్ల సాహిత్య అనుభవం ఉండటం చేత ప్రౌఢ సాహిత్యములో రాణిస్తూనే, ఇటు


బాలసాహిత్యంలో ఇప్పటికే చిన్నారి పొన్నారుల కోసం "బామ్మలు చెప్పని కమ్మని కథలు, బొమ్మలు చెప్పిన కమ్మని కథలు, పాల బుగ్గల- పసిడి మొగ్గలు" వంటి బాల సాహిత్య పోషణ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.రూపాయికే కథలు అంటూ బాలల కథలున్ధ ఫ్లిప్ బుక్ లు దాదాపు లక్షకు పైగా అమ్ముడుపోయాయి.ప్రౌఢ సాహిత్యంలో వీరు రాసిన రచనలపై కొందరు పి.హెచ్ డీ లు చేస్తున్నారు.


      ప్రస్తుతం గోరు ముద్దలు కథల పుస్తకం వెలువరించారు. బాలల మనసులకు నీతుల కిరణాన్ని ప్రసరింపజేయడమే కాకుండా, పాతదనం నుండి కొత్తదనాన్ని ఎలా సృష్టించుకోవచ్చో తెలియపరిచారు.నేటి వర్ధమాన సాహితీవేత్తలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నారు.




బాగా ప్రాచుర్యం ఉన్న పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలనే తీసుకొని కొత్త తరహాలో సమకాలీన జీవితానికి అనుగుణంగా కథలు లిఖించారు.


ఇందులో ఉన్న 11 బాలల కథలు నవతరానికి దొరికిన ఆణిముత్యాలు అని చెప్పుకోవచ్చు.




ఈ గోరుముద్ద వయ్యి లోని మొదటి కథ "దేవత అనుగ్రహం" . ఇందులో ఒక వ్యక్తి కట్టెలు కొట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఒకరోజు చెట్టెక్కి పెద్ద కొమ్మలను నరుకుతూ ఉండగా తన చేతిలోని గొడ్డలి జారీ వాగులో పడిపోతుంది. తన తాతల కాలంలో వాగులోని దేవత తన తాత గొడ్డలి ని పైకి తీసుకు వచ్చిన విషయం గుర్తుకు రావడం, ఎంతసేపు వేచి చూసినా దేవత ప్రత్యక్షమవ్వకుండా గొడ్డలిని ఇవ్వకపోవడంతో అసహనం చెంది ఆ వ్యక్తి గట్టిగా అరవడం, అటుగా పోతున్న ఓ కోతి ఆ వ్యక్తి అరుపులు విని, అతనితో"నువ్వు చెట్లు నరకడం వలన దేవత ప్రత్యక్షమవడం లేదు. ఎందుకంటే చెట్లను నరికి, వనాలను నాశనం చేసేవారు అంటే దేవతకు చాలా కోపం. ఇప్పుడు కట్టెలు అవసరం లేకుండా గ్యాస్ పై, సోలార్ కుక్కర్ లల్లో వంట వండుకునే సౌలభ్యం ఉంది. పర్యావరణానికి హాని తలపెట్టకుండా పట్టణానికి వెళ్ళి గోబర్ గ్యాస్, సోలార్ పవర్ ల ఏజెన్సీ ప్రారంభిస్తే దేవత నిన్ను అనుగ్రహిస్తుంది"అని బదులివ్వడం, ఆ కట్టెలు కొట్టుకునే వ్యక్తి లో మార్పు రావడంతో చక్కని ముగింపునిచ్చారు రచయిత.




"కాకి-కడవ" కథలో , మండువేసవిలో బాగా దాహంగా ఉన్న ఓ కాకి ఓ కడవలోకి తొంగి చూస్తే నీళ్లు ఉంటాయి. అయినా ఆ కాకి నీళ్ళు త్రాగడానికి మరో వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన మరో కాకి మన తాతల కాలంలో మాదిరి కడవ అడుగున కాక నిండుగా నీళ్ళున్నాయి. పైగా గులకరాళ్లు వేసాము కూడా లేకనే నీళ్లు అందుబాటులో ఉన్నాయి కదా! మరి నీళ్లు తాగకుండా నే వెళ్ళిపోతున్నావ్ ఎందుకు అని ప్రశ్నిస్తుంది. ఆ కడవలో నీళ్లు మలినంగా ఉన్నందున త్రాగడానికి తను ఆసక్తి చూపడం లేదని, ఒకవేళ త్రాగితే ఎన్నో జబ్బులతో బాధ పడాల్సి వస్తుందని, మొదటి కాకి రెండో కాకికి చెబుతుంది.


తద్వారా రచయిత ఈ కథలో పిల్లలకి త్రాగడానికి ఎప్పుడూ పరిశుభ్రమైన నీటికే ప్రాధాన్యం ఇవ్వమని సూచిస్తున్నాడు. ఏదైనా పని చేసే ముందు తొందరపడి చేయకూడదని, కొంచెం ఆలోచించి చేస్తే మంచిదని ప్రయోగించిన చక్కని నీతి కథ.




మనకు తాతల కాలం నుండి తెలిసిన "పిల్లి మెడలో గంట" కథను నవతరానికి కొత్త సువాసన వచ్చేలా లిఖించారు. పెద్ద సంఖ్యలో ఉన్న రైతు ఇంట్లో ఎలుకలను, చప్పుడు చేయకుండా రోజుకు ఒక దాన్ని పిల్లి తినేయడం, రోజురోజుకు తమ సంఖ్య దిగిపోవడం, పట్టణంలోని కళాశాలలో చదువుతున్న చిట్టెలుక సెలవులకు ఇంటికి వచ్చి విషయం తెలుసుకోవడం, రైతు కొడుకు పట్టణం నుండి వచ్చిన సెంట్ బాటిల్ ను అటక పై కూర్చొని పిల్లి పై గుమ్మరీయడం వలన ఆ పిల్లి దేహం నుంచి వచ్చే పరిమళం ద్వారా ఎలుకలు ప్రమాదాన్ని ముందే గ్రహించి తప్పించుకోవడంతో కధ ముగుస్తుంది. చదువుకుంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా పరిష్కరించుకోవచ్చునని నీతులు ఇమిడ్చి రాసిన కథ.


"మూర్ఖత్వం" కథలో 'మనకు హాని చేయని ఏ ప్రాణికైనా మనం హాని తలపెట్టకూడదని, అలా కాదని అల్లరి చేష్టలతో పర జీవులకు హాని తలపెడితే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో' చక్కగా వివరించిన బాలకథ.




ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కథలన్నీ మానవ జీవితానికి చక్కని సందేశాత్మక రచనా ప్రయోగాలు. కథలన్నింటినీ సృజనాత్మకంగా రచించిన రచయిత రెడ్డి నాగరాజు గారి ప్రతిభను అభినందించకుండా ఉండలేం. తన మేధాశక్తికి పదునుపెట్టి పిల్లల కోసం చక్కని బాల కథలు రాశారు. వారి ఈ శ్రమ పిల్లల వరకు చేరితే అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. వారికే కాదు ఏ బాల సాహితీవేత్త కైనా.


రేపు మన కళ్ళు శుభ్రంగా ఉండి, దేశాన్ని నవ్యంగా రూపొందించాలంటే ఇటువంటి పొత్తాలను పిల్లలు చదవడం ఆవశ్యం. తల్లిదండ్రులు లేత మనసులకు ఇటువంటి కథలు చేరవేయడానికి ప్రేరేపించాలి. అప్పుడే నవభారతం నిర్మితమవుతుంది. జై బాలసాహిత్యం!!




పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్.


బనిగండ్లపాడు గ్రామం ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం-507202.




ప్రతులకు:- 

వేంపల్లి రెడ్డి నాగరాజు,

ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా,

రాయచోటి శాఖ, కడప (జిల్లా) - 516269

మొబైల్:- 7989928459,9985612167.

2, నవంబర్ 2020, సోమవారం

బాల కథంబం - గుడిపూడి రాధికా రాణి

 ఈరోజు సూర్య దినపత్రికలో ప్రముఖ బాల సాహితీవేత్త శ్రీమతి గుడిపూడి రాధికా రాణి గారి బాల కథంబం పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష (5).

అందరూ ఆదరించే పుస్తకం నాకు కూడా పంపి, నాలో సృజనకు పదును పెట్టేలా చేసిన రచయిత్రి గుడిపూడి రాధికా రాణి గారికి మనః పూర్వక కృతజ్ఞతలు.


నైతికాల మకరందంరాధికారాణి బాలకథంబం   (పుస్తక సమీక్ష)

పసిపిల్లలకు ఈ ప్రపంచంలో విలువైనవి, విశిష్టమైనవి, ఇష్టమైన సంపదలు ఏమన్నా ఉన్నాయీ అంటే అవి ఆలోచనా శక్తికి పదునుపెట్టి, మనసులో మంచి చెడుకు వ్యత్యాసం వివరించి, సద్గుణాల సమేతంగా సత్బాట వైపు నడిపించే బాలల కథలే అని కచ్చితంగా చెప్పాలి.


పిల్లల మనసులు ఐస్కాంతల్లాంటివి. వాటికి నైతికాలను నూరిపోసి, మెదడుకు పని చెప్పే కథలు కనిపిస్తే చటుక్కున అతుక్కు పోతాయి. చక్కగా ఇంట్లో అమ్మో, తాతయ్య నానమ్మలో, అమ్మమ్మ తాతయ్యలో, పాఠశాలలో ఉపాధ్యాయులో తేనెలొలుకు కథలు చెబుతూ ఉంటే అల్లరి బుడుగులు సైతం గప్చుప్ న కూర్చొని వారు చెప్పే కథల్లో విహరిస్తారు. కథల ఒడిలో వాలిపోతారు. కథల్లో వారికి వచ్చే సందేహాలను, బయట అంతుపట్టని విషయాలను కూడా త్వరగా నివృత్తి చేసుకోగలుగుతారు. అలా వారి మనసు, ఆలోచనా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. మరి ఆ రాకెట్లా దూసుకుపోయేలా చేసే ఇంధనం.. మేలైన బాలల కథలే కదా!.


అలాంటి మానవీయ, స్ఫూర్తి నీయమైన, ఆలోచనాత్మక, సృజనాత్మక కథలకు నిలయమే గుడిపూడి రాధికా రాణి గారి బాల కథంబం బాలల కరదీపిక.

రచయిత్రి గుడిపూడి రాధికా రాణి గారు ప్రముఖ సాహితీవేత్త. బాలల కథలు, పజిల్స్ ,గజల్స్, కవిత్వాలు రాయడంలో, నిత్య నూతనంగా ఆవిర్భవిస్తున్న నూతన కవితా ప్రక్రియల్లో కలం పట్టడంలో వారిది అందెవేసిన చేయి. రాసిన ప్రతి వాక్యం నలుపాకమే అని చెప్పాలి. భాషా క్రీడాకారిణిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధులు. మేలైన బాల సాహిత్యం, ప్రౌఢ సాహిత్యం అందించడంలో సిద్ధహస్తులు.


ఈ పుస్తకంలోని కథలు ఒక్కసారి చదివామంటే చాలు. అల్లరి చేసే గడుగ్గాయులు కూడా సద్గుణులు అవుతారు. ఆలోచించగలుగుతారు. అంతేకాకుండా సమాజంలో వేటికి విలువ ఇచ్చి జీవించాలో, వేటికి ఇవ్వకూడదో కూడా ఇట్టే తెలుసుకుంటారు, నేర్చుకుంటారు.

పెద్దలు సైతం ఈ కథల్ని పాయసంలా స్వీకరించి,వారి ముందు జీవితంలో ఎటువంటి తప్పులు చేయడానికి ఇష్టపడరు. అటువంటి మేలైన మహత్తర సందేశం కలిగిన కథలివి.

పదేపదే విసుగు లేకుండా చదివించే కథలు. వీటికి అవార్డులతో తూకం వేస్తే అది పొరపాటే అని చెప్పాలి.

ఈ కరదీపిక లో మనల్ని తొలకరిగా పలకరించే "జేబులో జోరీగ" కథ నుండి "ఇరుకిల్లు" కథ వరకు, అన్ని మనల్ని పుష్పక విమానం లో కూర్చోబెట్టుకుని చక్కగా విహరింప చేస్తాయి."మనిషి కావాలి మనిషి"అన్నట్టు,"మనిషి లక్ష్యం మనీషి" అన్న సూక్తే లక్ష్యంగా ఇవి మనల్ని తీర్చిదిద్దుతాయి. నవ్విస్తాయి, నేర్పిస్తాయి ఈ కథలు.

 "జేబులో జోరీగా"కథలో రాఘవయ్య అనే పిసినారికి ఐదు రూపాయల నాణెం దొరకడం, అది మాట్లాడుతూ, రాఘవయ్యని ముప్పుతిప్పలు పెట్టడం, ఎంత దూరం విసిరేసిన తిరిగి తన జేబులోకి రావడం, చివరి ప్రయత్నంలో బిచ్చమెత్తుకునే ముసలమ్మకు ఐదు రూపాయల నాణెం దానం చేయగా, ఆ నాణెం ఏం మాట్లాడకపోవటంతో కథ ముగుస్తుంది.

ఈ కథ ముగింపులో,"ఆకలి వేయకపోయినా స్వార్థంతో తను కొనుక్కుందాం అనుకుంటే, వారించి, వాదించి, వేధించిన ఆ డబ్బే, ఆకలి తో బాధపడుతున్న వ్యక్తికి దానం చేయగానే శాంతించింది"అన్న ముగింపుతో గొప్ప అర్థాన్ని ఇచ్చి చాలా సృజనాత్మకంగా రచించారు రచయిత్రి.

"చంద్రుడి కోపం, సూర్యుడి తాపం" కథలు మనకెందుకు నెలరోజుల్లో నాలుగు సెలవులు (4 ఆదివారాలు), చంద్రుడు ఎందుకు ఒక రోజు సెలవు (అమావాస్య) తీసుకుంటాడో చాలా చక్కగా వర్ణించారు.

అలాగే ఒకప్పుడు చేదుగా చెరుకు, తీపిక కాకర ఉండి ఇప్పుడెందుకు చెరుకు తియ్యగా, కాకర చేదుగా ఉందో , ఒకప్పుడు పాముకి కాళ్లు ఉండి, ఇప్పుడు ఎందుకు పాకుతుందో జానపద కథలు లాగా కల్పితాత్మకంగా సృజించారు రచయిత్రి.


"పంచదార పిల్లి" కథలో, మంచితనానికి, దొంగతనానికి సమాజం స్పందించే తీరు"ఎలా ఉంటుందో విశ్లేషణాత్మకంగా వివరించిన కథ అందర్నీ ఆకట్టుకుంటుంది.


"కుదురులేని కుంకుడు గింజ" కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి."కుదురుగా ఉంటే అందరూ ఇష్టపడతారు" అన్న నేపథ్యంతో కుంకుడు గింజకి , చింతగింజకి మధ్య జరిగిన కథ. మన పరిసరాల్లో నుంచే కథా వస్తువులు తీసుకుని కథలుగా లిఖించడం రచయిత్రి గుడిపూడి రాధికా రాణి గారి సృజనాత్మకతకు అద్దం పడుతుంది.


ఇందులో చెప్పుకోవాల్సిన కథ "కుండ కోరిక "కూడా. ఇది వాట్సాప్ లో రెండురాష్ట్రాలు చుట్టివచ్చిన రైలు లాంటిది. గొప్ప నీతి ఉన్న జీవితానికి సంబంధించిన కథ. కష్టాల కడలిని దాటుకుంటే పొందే సుఖాన్ని, భయపడితే పొందే శోకాన్ని చక్కగా వివరించిన కథ.

"పిసినారి బావ, కోడలి దానగుణం, పిండివంటల రహస్యం" కథలు ముందుచూపు నేర్పించే నిండైన బాలల కథలు.

"ఇరుకిల్లు" మధ్య బంధాలు ఎలా కొలువై ఉంటాయో, భవనాల్లో మానవీయ బంధాలు ఎలా దాక్కుంటాయో" వివరించిన వర్తమాన సమాజపు కథ.

ఈ ఇరవై రెండు కథల్లో కథలో భాగంగానే ముగింపులు నీతిని వివరించారు రచయిత్రి.



ఇలా ఎన్నో ఆసక్తికర శీర్షికలతో,నైతికాల కథలతో ముస్తాబైన ఈ బాల కథంబం కరదీపిక పిల్లల పాలిట ఓ గురువు, ఆస్వాదిస్తే మకరందం, పెద్దల పాలిట మార్గ నిర్దేశం, వర్ధమాన రచయితల పాలిట కామధేనువు, దిక్సూచి.ఇలాంటి కథలు మొత్తం పిల్లలు అందరూ చదివి ఆస్వాదించాలని ఆకాంక్షించాలి ప్రతి తల్లిదండ్రులు. రేపటి భావి భారత పౌరులు ఉత్తమంగా తయారు కావాలంటే చిన్నతనం నుండే ఈ "బాల కథంబం" వంటి కథలు చదవాలి. మనిషి నుండి మహర్షిగా జీవించాలి. బాలసాహిత్యంలో ఇటువంటి మనోరంజక కథల పొత్తాన్ని వెలువరించిన రాధికా రాణి గారికి అభినందనలు.