25, జనవరి 2023, బుధవారం

ఇయ్యాల ఊళ్ళో - గూండ్ల వెంకటనారాయణ

 'Capella songs of ఇయ్యాల ఊళ్ళో'

★ 

1


"All you need to know of a place is,

do people live there.

If they do, you know everything."

(A Village Life)

~

Louise Glück , Nobel prize in literature.


దేశానికి జీవనాడులగా కేవలం చెప్పుకోవడానికే పరిమితమై,పల్లెల్ని పల్లీయుల జీవితాలని చాలా చిన్న చూపు చూస్తూ, పట్టించుకోకుండా ఉన్న ఇప్పటి ఆధునిక సాంకేతిక నానో మైండ్స్ కి పల్లెల మట్టి, మనుషులు, మమతలు, ప్రేమలు గురించి కచ్చితంగా తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఉరుకుల పరుగులతో అతలాకుతలమౌతున్న ఇప్పటి జీవితాలకు మట్టి ‌పరిమళం రుచి చూపించాల్సిన బాధ్యత కచ్చితంగా పల్లీయుడిగా బతికే కవితా ప్రేమికుడిపైన ఉంది. మట్టిలో పుట్టి, పెరిగి, కూలికెళ్ళిన అమ్మని తలుచుకున్నప్పుడో, గొడ్లు కాయడానికి వెళ్లినప్పుడో, సరదాగా జతగాళ్ళతో కలిసి ఈతగొట్టడానికి వెళ్ళినప్పుడో , అప్పటి స్మృతులను గుర్తు చేసుకుంటూ తన దేహంలో అల్లుకుపోయిన పల్లెటూరి గురించి ఒక కుర్రాడు ఏ సంగీత సాధనాలు లేకుండా పాడుకుంటున్న పాటలివి. వేదన, విరహం,వలపోత అన్నీ తను అనుభవించిన ప్రతీ పల్లె ఛాయల్ని గూండ్ల వెంకటనారాయణ తాను రాసిన ఇయ్యాల 'ఊళ్ళో కవిత్వంలో' నిక్షిప్తపరుచుకున్నాడు.



2


 >ఇయ్యాల ఊళ్ళో


మాగాడి చుట్టూ కొంగల ఈకలు రాలినట్టు 

పళ్ళెం చుట్టూ మెతుకులు

ఆటలకి పరుగుతీస్తూ

సగం కలిపి వదిలిన పాలబువ్వ 

'పళ్ళెం చుట్టూ కళ్ళమే'

అని అరిసే అమ్మ గొంతు

కొత్తగా పండక్కి ఆలికిన పేడమట్టి కమ్మని వాసన గుడిసె చూరులకి వేలాడుతున్న ఎండ


మట్టిదుమ్ము అరిచేతుల నిండా అద్దుకొని 

గురి చూసి కొట్టిన గోళీకాయ కేరింత 

గాలిని మేస్తూ మబ్బుల పరుగు

రెక్కలతో ఎండని విసురుతూ పచ్చుల పయానాం


జంగిడి గొడ్లు అడివికి బోయిన బాటంతా

గిట్టల జాడలు 

పేడకల్ల తాంబేళ్ల గుంపు 

బర్రెపెండ మీద కుచ్చిన రాయి 

నెత్తిన పొదిగిన ఉంగరం 

ఒంటి చుట్టూతా నీడని పెనేసుకున్న చెట్లు


పగలంతా గోళీలాటలో కాలానికి దుమ్ము పూసి, 

మట్టి పులుముకొని వెళ్లి 

ఇంటిముందు వాలగానే అమ్మ చివాట్లు 

బెరుకు బెరుగ్గా గడపలోకి చేరి 

మంచం మీద ముడుక్కుంటే 

అప్పటిదాకా తిట్టిన అమ్మ 

అప్పుడే బతిమిలాడి ఒళ్ళో కూచ్చోబెట్టుకొని 

కొసరి కొసరి బువ్వ తినిపిస్తుంది 

అప్పుడు బుగ్గ మీద అమ్మ పెట్టిన ముద్దు 

ఒళ్ళంతా చక్కిలిగింతలు పుట్టిన కులుకు


కాసేపు పక్కమీద కన్నుకొరికి 

కునుకు తీరి, ఇంటి ముందు 

దడి పక్కన నిలబడగానే 

నెత్తిన సూర్యుడు కుంకుమ చల్లుకున్న పుల్లెద్దులాగా 

గుడిసెనకమాల కొట్టంలోకి చొరబడుతూ కనబడతాడు


బజాట్లో ఊతకర్ర నేల పొడుస్తూ 

అడుగులు లెక్కపెడుతూ 

చెట్టు కొమ్మలంతున్న 

బుర్ర మీసాల సందున 

చిరునవ్వు పిట్టల్ని ఎగరేస్తూ 

ముతక తాత వెళ్తూ ఉంటాడు


దిబ్బలో ఎండిన పెంటకుప్పల్ని 

గెలిగిస్తూ కోళ్ల గుంపు 

మర్నాడు పండక్కి పళ్ళెంలో 

పొగలు కక్కే రాగిసంగటి ముద్దల నడుమ 

చియ్య ముక్కల రుచి విందు


నీళ్ళతొట్టి కాడ జాలాడమ్మటి 

బండ మీద అంట్లు తోముతూ 

గాజుల చేతులకి బూడిద పూసుకున్న అమ్మ


తూరుపు ముంగిట్లో

ఎడ్డకొండ ఎనకమాల 

తొంగిచూస్తున్న పున్నమినాటి 

జీరంగిగుడ్డు చంద్రుడు


సావిటి కాడ మసీదులో 

అల్లాని పిలుస్తున్న గొంతు


ఎద్దుల కాడి మీద గడ్డిమోపు కట్టుకొని 

అరక తోలుకుంటూ వస్తున్న నాన్న


పైన నింగిలో

సగం చీకటి సగం వెలుతురు నిండుకొని ఉంది 

బతుకులోని తీపి చేదుల్లాగా 

ఊరంతా ఇప్పుడు నలుపూ తెలుపుల 

గచ్చకాయలా ఉంది.


వాస్తవానికి ఈ కవితల్ని విప్పి విమర్శ (విశ్లేషణ అంటే బాగుంటుందేమో) చేయాల్సినంత పనేమీ లేదు. ఇతను ఈ కవితలో చెప్పేది ఒక పిల్లాడి జీవితం ఊరిలో సాధారణ అనేక దృశ్యాలు. పిల్లలు ఆటల్లో మునిగితే ఎంత ఆతృతగా తిండిమీద కూడా దృష్టి పెట్టకుండా పరుగులు తీస్తారు దానిని ముందు ప్రారంభించి ఆ నేపథ్యంలో ఊరి జీవితాన్ని, అందులోని నలుపూ తెలుపులు లాంటి తీపి చేదును పట్టి చూపించాడు.


ఈ రాతరిది ఎక్కువగా Narrative poetry. తన ఊరి భాషని,పద వాడుకని సర్వసాధారణంగా,మనతో మాట్లాడుతున్నట్లు కవిత్వం చేసేస్తాడు. కవితల్ని నిర్మించే పద్దతి చాలా flexible గా, detailing గా కనబడుతుంది.

ఇతను పల్లెపదాలతో బతుకుతున్నందున సామెతలతో కవిత్వం రాస్తున్నాడా? లేక వాళ్ళూరి సామెతల్ని సమకూర్చుతున్నాడా? అని ఆశ్చర్యపోయాను.

ఆలోచనతో అవినాభావ సంబంధం ఉన్న వస్తు సముదాయాన్నీ,ఘటనల క్రమాన్ని, సన్నివేశాల సమాహారాన్నీ,జత చేస్తూ 'ఆడిటరీ ఇమిజినేషన్' పద్దతిని చాలా ఇంపుగా వాడిన వాక్యాలు ఇందులో ఉన్నాయి.

  


> మమ్మ కళ్ళలో వాళ్ళూరు 


మమ్మ అప్పుడప్పుడూ తనలో తను 

గొణుక్కుంటూ ఉంటుంది

కొన్ని సార్లు ఎవరికీ వినిపించని పాటలు పాడుకుంటూ ఉంటుంది

బువ్వ ఒండుతూనో, కసువు ఊడుస్తూనో మాట్లాడుకుంటూనే ఉంటుంది.

ఏ పనీ లేక పోయినా ఒక్కో సారి పదేపదే "ఓరా..."అని పిలుత్తూ ఉంటుంది.


నేనాం పిలుపు పెద్దగా పట్టించుకోను.

కొన్ని సార్లు "ఏందవా.."అని ఎళ్తే, 

ఎందుకు పిలిచానా అని తనలో తను ఆలోచించుకొని

"పిలుత్తుంటే ఎంత సేపటికీ రావేంది"అని తిట్టి పోతుంది.

నాకప్పుడయితే పిచ్చి కోపమొస్తుంది


"మా నారాయణ కొచ్చే పిల్ల ఎట్టుంటదో. మా ఊరమ్మాయినే సెయ్యాలి. ఈ సావాన్లన్నీ దాని కోసవే" అంటది.

గూళ్ళల్లో ఒదిగిన పెద్ద బేసా నుండి సిన్న గలాసు దాకా అందుకే వాడకుండుంచింది.


నేను కూచ్చోని రాసుకుంటంటే "పిచ్చి పన్లన్నీ సేత్తుంటాడు."అని బుగ్గ గిచ్చి ముద్దు పెట్టుకొని పోతుంది.

కొన్ని సార్లయితే చెప్పిన పనే ఎన్నో చెప్తూ ఉంటుంది చచ్చిపోయిన వాళ్ళ నాన్న పేరు తలుచుకున్నట్టు


కొన్ని సార్లు మమ్మ మాట్లాడితే

వాళ్లూరు గుర్తొస్తుంది


ఎన్నేళ్ళు అయితుందో 

మమ్మ ఈ ఊర్లో అడుగుపెట్టి 

ఇంకా ఆవ గొంతులో వాళ్ళూరు.


వాళ్ళమ్మని పిచ్చిరావక్కా అనే వాళ్ళంటా

మా నాన్న అప్పుడప్పుడూ అదే మాటతో 

మమ్మను ఎక్కిరిస్తుంటాడు 

అవేవీ పట్టించుకోదు మమ్మ


ఏ పనీ లేకపోతే పడుకొని పైకి చూస్తూ 

కనురెప్ప వేయకుండా కింద పెదవిని అప్పుడప్పుడు కొరుకుతూ 

ఆలోచిస్తూ ఉంటుంది.

అసలు ఆవ కళ్ళ ఎదురు గాలిలో 

ఏ లోకం ఉండి ఉంటుంది?

ఆ లోకంలో ఏమేమి ఉండుంటాయి?


మమ్మకు సరిగ్గా అంట్లు తోమను రాదు

బట్టలు మట్టి పోయేలా ఉతకటం రాదు 

బువ్వాకూరా రుచిగా వండటం కూడా రాదు


ఆవ ఇల్లూడిస్తే సగం కసువు బండల మీదే పొర్లాడుతూ ఉంటుంది

ఆవకి సరిగ్గా పనే సెయ్యను రాదు.


కానీ వాళ్ళమ్మ కాడ నేర్చుకున్న 

కోడికూర, సంగటి వండితే మాత్తరం

అప్పటిదాకా నాలికమీద రుసులన్నీ ఏ చెట్లు ఎతుక్కుంటూ పోతాయో

కోడిచారు అద్దుకున్న సంగటి ముద్ద 

ఊళ్ళో బొడ్రాయి ఉన్నట్టు వోరం రోజులైనా నిలబడాల్సిందే.


చేలో పని ఎంపర్లాడుతూ చేసిద్ది

చేని మీద తిరిగే ఉత్తితీతి పిట్టలాగా 

ఒక్కతే కలుపు తీసుకుంటుంది.


ఇద్దరు పెళ్ళాలున్న మా నాన్నంటే 

మమ్మకి అప్పుడప్పుడూ బో కచ్చ.

ఏడాదికి ఒక సారన్నా మా పిన్నావ మమ్మా తిట్టుకుంటుంటారు


ఎప్పుడన్నా మా నాన్న కొడితే 

ఇంకంతే!వారం రోజులు కురిసిన తుపానులో 

నానిన అడివిలాగ అయితుంది ఇళ్లు.


మా నాన్ని బెదిరియ్యాటానికి 

"మన్నోల్లకి చెభ్తానని"పసిబిడ్డలాగా ఏడ్చిద్ది

"ఒక్కనాడన్నా మా నాన్న మమ్మని కొట్టెరగడు

ఇట్ట మిడియాలం సూపిచ్చే నీతో ఎవుడు 

కాపురం జేత్తరు పో.."అని ఇదిలిచ్చి

బట్టలు సర్దుకొని వాళ్ళమ్మా నాన్నా లేని 

వాళ్లూరు పోతానంటది.


మమ్మ గెవుతుల్లో ఆ ఊరు ఎలా ఉంటుందో వాళ్లమ్మా నాన్నా లేకుండయితే ఉండరనుకుంటా.


ఎప్పుడన్నా మమ్మమ్మ ఊరెళితే 

ఊరిలోని పతి ఇంటినీ పలకరించబోతే 

పొద్దుపోదు మమ్మకు

యాభై ఇల్లులున్న ఆ చిన్న ఊరిలో 

తిరుపతమ్మ పలకరించని మడిసి

చెయ్యి కడగని ఇళ్లు ఉండదు.


ముంగిలా ఉండే వాళ్లన్నకి ఎడతెగని 

కబుర్లు చెప్పిద్ది

'మా వొదిన దోసొక్కలేసి పప్పు జెత్తే 

ఎంత కమ్మగుంటదో ' అని ఎన్ని సార్లు జెప్పిద్దో


ఆ ఊరు నుంచి తిరిగొచ్చే పతి సారీ 

మళ్ళీ వచ్చి ఈ ఊరు సూత్తనో సూడనో 

అనే బెంగతోనే తిరిగెల్లేది.


దొంతోరపల్లె తువ్వ దారి మీద నడుత్తూ 

కొండ చాటుగా ఉన్న వాళ్ళ అమ్మ గారి ఊరిని 

ఎన్ని సార్లు తడి కళ్ళతో సూసిద్దో... దానికి అంతే లేదు.


ఈ పుస్తకంలో రాతరి తన అమ్మని తలంచి,అమ్మని, ఆమెతో మమేకమైన జ్ఞాపకాలని ఇందులో నాలుగు కవితల్లో రాసుకున్నాడు. ఒక్కొక్క దానిది ఒక్కో ఊసు. పనికెళ్ళిన కూలి తల్లి గురించి ఏడ్చే పిల్లోడి విచారగీతిక -''అమ్మింకా ఇంటికి రాలేదు''; చుట్టపు చూపుగా పుట్టినూరొచ్చిన వాళ్ళమ్మతో ఊరోళ్ళు చూపించే మమకారం,పంచుకునే విచారం - ''ఎన్నటి రాగి సంగటో'';ఆత్మీయతలు అనుబంధాలు అరకొరగా ఉండే నగరజీవితంలో అమ్మని తలుచుకుని కనీసం అమ్మ కొంగునైనా పంపమనే కొడుకు కన్నీళ్ళు - "అమ్మ కొంగు తోడు కావాలి" ఏ కవితల్లోనైనా తల్లి(పై) ప్రేమ మనల్ని పెనవేసుకుంటుంది. అమాయకంగా,చెమటదేహాలతో బతికే అనేక అమ్మల బతుకులు,గమనాలు ఇందులో మనకు తారపడతాయి.

"…

పందిరి కొసన పండగ తారలాగా

క్రిస్మస్ అనగానే

నువ్వే మతికొస్తావురా లాజర్గా."(పండగపూట నీతో)


పల్లెల్లో క్రిస్మస్ పండుగను జరుపుకునే తీరును వర్ణించే తీరు చలిలో కాచుకున్న మంటలా హాయిగా అనిపిస్తుంది.


> వాన గాలి


ఒక్కన్ని కూర్చున్నాక ఇంకేమీ తోచదు 

కాస్త గాలి

అక్కడక్కడా చుక్కలు 

ఇలాంటి రోజుల్లోనే నువ్వు గుర్తుకు వస్తావు


చావులూ పుట్టకలూ ఏడుపులూ సిద్దాంతాలూ అన్నీ నా నుంచి యడమయ్యి

నా ఆవేశమంతా చల్లబడిపోయాక

ఊరిలో కానుగ చెట్టుకింద కూర్చొని 

నువ్వు చెప్పిన కుందేలుపిల్ల కత మనసులో మెదులుతుంది.


వానలో తిన్న కలేకాయల రుచి

ఉన్నట్టుండి మతికి వస్తుంది.


కంది చేలో పరిగెత్తుతూ కాలికి కొయ్య గుచ్చుకొని తగిలిన గాయం

దానిని వేలితో తడుముకుంటే

నువ్వు కట్టిన కట్ట

బెదురుతో నీ చూపులు 

అప్పుడే నిన్ను తొలిసారి ముద్దు పెట్టుకుంది


ఇప్పుడివన్నీ ఇలా ఒక్కన్నే కూర్చున్నాక గుర్తొస్తూ ఉంటాయి


పగులు మిరపతోటలో పాము ఒళ్ళో దూకి 

మెత్తగా పాక్కుంటూ పోయిన స్పర్శ గుర్తొస్తుంది.


వానకి ముందు

కొండంతా మబ్బుని కప్పుకోవడం 

ఇంటి ముందు నిల్చొని చూస్తుంటే

నువ్వు దగ్గరికొచ్చి నవ్వి

ఏముందని అలా చూస్తావు అని పక్కనే నిల్చోగానే 

వానగాలి నునుమెత్తగా తాకుతూ పోయేది


ఊరికి దూరంగా జరిగాక ఇవే

తలుస్తూ ఉంటాను

ఇవి తలుచుకొని నీకు ఏవో కబుర్లు చెబుతున్నట్టు 

కవిత్వం రాసుకుంటాను


నువ్వూ ఊరూ కవిత్వ

ఇప్పుడు ఇవి మాత్రమే నాకు మిగిలింది.


ఇలా ప్రియురాలితో చెప్పుకోవాలనుకునే కన్నీటి చారికలు కూడా కనిపిస్తాయి. వాటిలోనూ అతణ్ణి వీడని పల్లె ఉంది. 

ఇతనికి కురిసే వాన, వీచే గాలి,నల్లని రాత్రి, కప్పబడ్డ వెన్నెలంటే అత్యంత ప్రీతి కూడా. అందుకే చాలా వరకు వాటినే కవితా వస్తువులుగా మార్చుకున్నాడు. 


3


ఇంకా ఈ కవిత్వ సంపుటిలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు -


ఎక్కడో ఇప్పటి జీవితం మీద 

ప్రేమ సన్నగిల్లినప్పుడే 

గతంలోకి పోతుంటాం అనుకుంటా

కోల్పోయినవి ఎంతటి మధురమైనవో 

కోల్పోయిన నీకే కాదు ఈ సృష్టికీ తెలీదు


జీవితంలో అతి సూక్ష్మాతి సూక్ష్మమైన 

ఒక మధుర ఘడియనైనా కోల్పోవడం 

ఈ సమస్త మానవ లోకపు పరాజయం


అది ఈ సృష్టి నెత్తిన ఒక విషాధ శాశ్వత హస్తిక

~

Interior గా ఏదో ఒక తాత్వికతను తనకు తానే చెప్పుకుంటున్నట్టు.


తగుళ్ళ గోపాల్  "దండకడియం"లోని ఒకే ఆకాశాన్ని కప్పుకున్నవాళ్ళం మతికొచ్చింది ఇందులోని"ఆమె లోకం" చదువుతున్నప్పుడు. పల్లి పట్టు  నాగరాజు "యాలై పూడ్సింది" కవిత్వ సంపుటిలోని కుశాల,రుక్కత్త లాంటి కవితలు గుర్తొచ్చాయి. అంటే ఏ ప్రాంతానికి చెందిన పదజాలాన్ని ఎవరికి వాళ్ళు తమ కవిత్వంలోకి తెచ్చుకున్నారన్నమాట.

ఇంకా ఇతనికి ఎర్రని విప్లవాన్ని ప్రేమించే అటవీ అన్నలని చూడాలని, కార్ల్ మార్క్స్ తో చెలిమి చేయాలని బహు ప్రీతి. అందుకే ఎంతో ప్రేమగా వాళ్ళపై కవిత్వం రాసుకున్నాడు. 


ఇవి కేవలం ఎమోషన్స్ ఇమాజినేషన్స్ డాక్యుమెంటేషనే కాదు, జీవనానికి సమూల స్తంభాలుగా అయ్యుండి కూడా పరిగణింపబడని మనుషుల,పల్లెల జీవరాతలు. పల్లెల మనుగడ,మరుగున పడకూడదని రాసుకున్న కవితలు. ఈ కవి తను వాడే ఉపమానాలకు పల్లెటూరి జీవన సంబంధితాలనే ఒక పరిధిలోకి పెట్టుకుని రాయలేదు. అవి జీవితంలో కలిసిపోయినవి తనకు. తనకు ఉపమేయాలు ఉపమానాలు వేరు వేరు కాదు. వాటిని వీటితోనూ, వీటిని వాటితోనూ ద్వంద్వ భావ సముచితంగా పోల్చుకుంటూ రాసుకున్నవి. ఒక్కమాటగా ఈ పుస్తకంలోని కవితలు పల్లె ఆత్మగీతాలు. సజీవంగా నిలబడగలిగే "సబాల్టర్న్ పోయెట్రీ".


కవిత్వమంటే ఇప్పటి తరం యువకులకి కొన్ని లవ్ పోయెమ్స్ అనుకునే సోకాల్డ్ సాహిత్యకారుల మాటల్ని కొట్టి పారేసే విధంగా రాసుకున్న  అస్థిత్వ,అనుభూతుల,అనుభువాల కావ్యం. తప్పకుండా చదవాల్సిన కవిత్వం. ఇది ఒట్టి మాట మాత్రం కాదు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన హోరు ప్రచురణలకు అభినందనలు మరియు శుభాకాంక్షలు. రాతరికి,పాటగాడికి మేల్తలుపులు. 



లిఖిత్ కుమార్ గోదా. 

25-01-2023


పుస్తకం కొనాలనుకున్నవారు.

7032553063 కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి పొందవచ్చు.

నవోదయలో కూడా మీకు లభిస్తాయి.

బుక్ 100 రూ... పోస్టల్ చార్జెస్ 36 రూ…

16, జనవరి 2023, సోమవారం

మాన-భంగం- బాలాజీ ప్రసాద్

 ప్రస్తుత శారీరక అఘాయిత్యాలపై మాట్లాడే 
'మాన- భంగం' నవల

~

"The object of the novelist is to keep the reader entirely oblivious of the fact that the author exists, even of the fact that he is reading a book"

- Ford Madox Ford




తెలుగు లిటరేచర్ లో డిటెక్టివ్ (ఇన్వెస్టిగేషన్) తరహాలో నేను చదివిన మొదటి నవల ఇది. ‌ రకరకాల సమస్యలతో తనామునకలవుతున్న ప్రస్తుత సమాజంలో మనుషుల్ని భయంకరంగా బాధపెట్టేవి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు- అత్యాచారాలు. రేప్ - ఒళ్ళు గొగ్గురుపొడిచే పదం. మానసిక స్థితిని కుళ్ళపొడిచే పదం. చాలామంది కుర్రకారు మగాళ్లు ఆడవాళ్ళ మీద అత్యాచారానికి ఎందుకు పాల్పడుతున్నారు? ఈ ప్రశ్న ఈ నవలలో రకరకాల రేప్ల మీద పరిశోధన చేస్తూ పుస్తకం రాస్తున్న ఇన్స్పెక్టర్ మాధవ్ లోనే కాదు మనలోనూ మొదలవ్వాలి.


విచక్షణ కోల్పోయి, వావివరసలు మర్చిపోతూ ఆడపిల్లల్ని శారీరక అఘాయిత్యాలకు ఎందుకు బలి చేస్తున్నారు ఈ దేశంలో. ఇవన్నీ మన ఇంటి దగ్గర ఉండే నివారణ కావాలి. ఇంటిదగ్గర తల్లిదండ్రులచే 'గుడ్ టచ్- బాడ్ టచ్' గురించి ఆడపిల్లలతో మగ పిల్లలెలా మసులుకోవాలి? మగవాళ్ళతో ఆడపిల్లలు ఎలా నడుచుకోవాలో ఇంటిదగ్గరే తల్లిదండ్రులు వివరంగా చెప్పాలి. బడిలో ఇంటి ఆవరణలోనూ ఎలాంటి సమస్యలు పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఎదురవుతున్నాయో తెలుసుకోవాలి.

★★★

నవలా కథనం ప్రకారం:-

ఓపెనింగ్ చాప్టర్ ప్రియా అనే స్నేక్ క్యాచర్ సుబ్బారెడ్డి పొలంలో పాము పట్టడంతో మొదలవుతుంది. తన భర్త మాధవ్ పోలీస్ ఆఫీసర్. వాళ్ళు ఉండే ఊరి దగ్గరి బ్రిడ్జి కింద శవం కనబడిందని కూతురు యోగితాని కాలేజ్ కి డ్రాప్ చేయడానికి వెళుతున్న మాధవ్ కి మంగమ్మ, నాగయ్య ద్వారా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అది ప్రకృతి అనే అమ్మాయి శవమని, ఆమెని రేప్ చేశారని, తర్వాత బ్రిడ్జి కింద పడేశారని పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తుంది. హంతకుడు ఎవరో తెలుసుకోవడమే మాధవ్ వెతుకులాట.


మాధవ్ రకరకాల రేప్ ల మీద ఒక పుస్తకం కూడా రాస్తుంటాడు. మాధవ్ తన కొలీగ్స్ పురుషోత్తం, వనజలు కలిసి suspects ని ఎంక్వయిరీ చేస్తారు. ఎదురింటి కుమారస్వామిని, బాయ్ ఫ్రెండ్ దుర్గాప్రసాద్ ని, ఆఫీసుకు పగడాల సత్యాన్ని, బాబాయ్ వరసయ్యే ధర్మేంద్రని ఇలా తన ఎంక్వయిరీలో ఒక్కో కొత్త కోణంలో ప్రకృతి అత్యాచారానికి చిన్నప్పుడు నుండే ఎలా బలైపోయిందో చెప్తాడు. ఈ కేసు గురించే పురుషోత్తం మాధవ్ లు ఇద్దరు గొడవలు పడుతుంటారు.


ప్రకృతిని గురించి ఆలోచిస్తూ తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి తనపై జరిగిన మూడు అత్యాచారాలు అతన్ని వదలని దెయ్యాలయి, తన జీవితం మీద ఎంత ప్రభావం చూపాయో ఒక చాప్టర్లో చెప్తాడు‌.


చివరికి తన భార్య ప్రియ ఒక పెద్ద చెట్టు కింద ఉన్న పాముల్ని పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం చెప్పినప్పుడు మాధవ్ కి ఈ కేసును ఎలా డీల్ చేయాలో స్ఫురణకు వస్తుంది‌. ఆకలితో తను పెట్టిన గుడ్లని చూడకుండా,తన పిల్లలి కూడా చూడకుండా కన్నపామే తినేసినట్టు తండ్రి సుబ్రహ్మణ్యమే కూతురు ప్రకృతిని అత్యాచారం చేసి పిడిగుద్దులతో చంపి తన చాపర్ లోనుండి బ్రిడ్జ్ కిందికి పారేశాడని.


ఇలా ముగుస్తుంది నవల. 

★★★

మనుషులు మానసిక సంఘర్షణలు ఎలా ఉంటాయో వివరించిన సంఘటనలు ఉన్నాయి. సమకాలీనంగా అత్యాచారాలపై వస్తున్న తెలుగు సినిమా చూసినంత ఫీలింగ్ కలిగింది. తీసుకున్న వస్తువు, శిల్పం చాలా మటుకు దేనికి తగ్గ ఫ్లేవర్ దానికి వాడి ఆకట్టుకునేలా రాశాడు.



With the Author: Balaji Prasad 

ఈ నవలలో నాకు బాగా నచ్చిన విషయాలు 

1. ఇన్వెస్టిగేషన్ మోడ్లో నవల నడిపించడం. 


2. మాధవ్ బాల్యంలో అత్యాచారానికి గురవడం. ఆడవాళ్ళు ఎక్కువ శాతం రేపులకు గురవడం మనం చూస్తూ ఉంటాం. కానీ మగపిల్లలను కూడా మగవాళ్ళు తమ శారీరక వాంఛకు ఎలా లొంగ తీసుకుంటారో చెప్తుంది మాధవ్ చిన్నప్పటి పాత్ర. ఇలాంటి సంఘటనలు మనం ఇంగ్లీష్ లిటరేచర్లలలోనూ, సినిమాల్లోనూ తరచూ చూస్తూ ఉంటాం. కానీ పెద్దగా దృష్టి పెట్టం.


3. ప్రియ పాత్ర. ఒక నవలలో మొదటి నుండి ఒక పాత్ర గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటే ఆ పాత్ర ద్వారా రచయిత ఏదో ఒక విషయాన్నో, ఉపయోగాన్నో తెలియజేయాలనే చిత్రీకరిస్తాడు. ఈ నవలలు opening protagonical character స్నేక్ క్యాచర్ ప్రియది. రచయిత స్నేక్ క్యాచింగ్ చేసే ప్రియ ద్వారా ఏ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాడో మొదట నాకు అర్థం కాలేదు. Investigation తరహాలో నడుస్తున్న ఈ నవలలు ప్రియ పాత్ర స్నేక్యాచార్ గా ఎందుకు ప్రత్యేకంగా పెట్టాడు అని ఆలోచన. మాధవ్,ప్రకృతి మరణం విషయంలో ఎంతమందిని ఇన్వెస్టిగేషన్ చేసిన అంతుచిక్కని చిక్కుముడి చివరికి ప్రియ వల్ల వీడిపోతుంది. ప్రియ పాత్ర అక్కడ ఉపయోగమైంది. Major గా, Minor గా పాములు గురించి, పాములు మనస్తత్వం కలిగిన మనుషుల గురించి చైతన్యం తేవడం.

★★★

సోలోమోన్ విజయ్ కుమార్ రాసిన మునికాంతపల్లి కతల్లో 'యానాది సెంచయ్య ' ఒకటి. యానాదుల జీవన విధానంలో ఉపాధికి ఉపయోగపడే తత్వం పాటలు, వివిధ వేషాలు వేసుకొని (మగాళ్లు కోకా రైకా కట్టుకొని) ఆడవాళ్లలా యాక్షన్ చేయడం భలే విచిత్రమైన విషయంగా తోస్తాయి. డా. కేశవరెడ్డి చివరి గుడిసె నవలలో కూడా వాళ్ల జీవనం వెనుకున్న కన్నీటి సంఘర్షణ, తత్వం పాటలు పాడిస్తూ అవగతం చేస్తాడు. అలాగ, రచయిత బాలాజీ ప్రసాద్ కూడా యానాది జీవితాలను దగ్గరగా చూపించాడు. ఇందులో రచయిత పరిశీలనా పరిశోధనా నవలా రచనలో పడిన శ్రమ కనిపిస్తుంది. ఇందులో తత్వం పాటలు ఆకర్షణంగా అనిపించాయి.


'వాలు కళ్ళ ఒక చిన్నది.. దాని నెత్తిన ఒక కడవంట 

కాలు జారిపాయ.. కడవ పగిలి పాయా

నీళ్ళు పారిపాయా.. చిన్నదాని గుండె నిరమళ మాయ 

మాయా సంసారం ఇదేరా.. కలి మాయా సంసారమిదేరా'


యానాది జీవుల మౌఖిక సాహిత్యాన్ని కొంతలో కొంత నైనా లిఖిత సాహిత్యంగా మార్చి నిక్షిప్తపరిచేలా చేయడం హర్షించదగ్గ విషయం.


పల్లెల్లో మమేకమైన జీవితాలని చిత్రించడం కూడా బాగుంది. అందులో మిడియాళం పాత్ర కడుపుబ్బా నవ్విచ్చేలాగా ఉంది.

నా అభిప్రాయాలుగా రచయితకి కొన్ని సూచనలు ఇవ్వదలిచాను.

Tautology

'గాలిదేవుడు ఇసనకర్రతో ఊపినట్టు పొడబారిన చేలంతా జోరున గాలి'. ఇక్కడ ప్రస్తావించేదంతా గాలి వీస్తోందని. కానీ గాలికి సంబంధించిన అర్థాలను ప్రతీకలను రెండు మూడు సార్లు వాడటం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. భావం,వర్ణన కోసం వాక్యాన్ని తారుమారు చేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటివి ఈ నవలలు స్వల్పంగానే ఉన్నాయి. వీటిపై దృష్టి సారిస్తే మంచిది.(పేజీ నెం: 92:1:1)


అలాగే భాషను నడిపించే తీరులో ఒకసారి స్పష్టత కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. భాష ఎక్కడ సరళంగా ఉండాలో, ఎక్కడ మాండలికంలో ఉండాలో బాగానే చూసుకున్నాడు. కానీ ఒక్కోసారి సరళమైన వాచ్యంలో చెబుతూ, అదే క్రమంలో యాసని మాండలికాన్ని కలపడం వల్ల చదవడానికి వెసులుబాటుగా అనిపించక కాస్త ఇబ్బంది కలిగింది.


కొంచెం clarity కానీ విషయాలు

మాధవ్ తండ్రి యానాదయ్య ఎలా మరణించాడు? పోలిరెడ్డి కొట్టినందుకా? అవమానం వల్ల? అవసరమైన కాకపోయినా ప్రస్తావన క్లారిటీ ఇవ్వలేదనిపించింది. ఇవేం పెద్ద మిస్టేక్స్ ఏమీ కాదు. ఒకసారి దృష్టి సారిస్తే మంచిది. ‌

మొత్తానికి ఈ నవల ద్వారా ఇప్పటి జనరేషన్ పిల్లలకు ఎలాంటి సెక్స్ అండ్ సైకాలజీ ఎడ్యుకేషన్ నేర్పాలి? తల్లిదండ్రులు చిన్నప్పటినుండి తమ పిల్లలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తో పాటు విక్టిమ్ బ్లేమింగ్ అన్న విషయాలు అవగాహనకు తీసుకురావాలి అనే వాటిని మనముందుకు తెచ్చి పెట్టి ఆలోచించమంటాడు.


ఒక చోట -


మనుషులు సెక్స్ విషయంలో తెలీయకుండా నిగ్రహం ఎందుకు కోల్పోతారు. ఆ సమయంలో ఆడ, మగ ఆక్రోశం తీర్చుకోవాలని ఎందుకు చూస్తారు. పిల్లల మీద, ఆడవాళ్ళ మీదనే ఈ అఘాయిత్యాలకు ఎందుకు పాల్పడతారు. వాళ్ళు బలహీనులు అనా? వాళ్ళ కన్నా బలవంతులు ఐతే వాళ్ళ అహన్ని అణగార్చుకోడానికి వీలు కాదనా?. ఆ లెక్కన ప్రతిఒక్కరిని గెలుచుకోవాలని అనుకుంటారు కదా? తనా మనా అనే భేదాలు లేకుండా బంధాలు మరిచి కోర్కెలు తీర్చుకోవాలని అనుకుంటారు కదా. అవకాశం ఉండదు కాబట్టి అలా చేయలేకపోతున్నారా? ఒకవేళ అవకాశమే ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఆ రెండుక్షణాల క్షణికావేశానికి అంతలా ఎందుకు పాకులాడుతారు? ఆ రెండుక్షణాల క్షణికావేశం తర్వాత ఏముండదు.. దాని వల్ల ఘోరం జరిగిపోతుందనేంత తెలీని అజ్ఞానంలో ఉంటారా? తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి…


ఈ ఉద్వేగం, సంఘర్షణ రచయితవి.ఆ కోపంలోంచే ఈ నవల రాశాడనిపిస్తుంది రచయిత. మంచి సోషల్ అవేర్నెస్ తో, మంచి కథనంతో బాగా రాశాడు నవలని. యువ రచయితలు ప్రస్తుత సమాజం మీద, మార్పు మీద దృష్టి పెట్టారనడానికి ఈ నవల ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇంకా రాయాలని ఆశిస్తున్నాను. అభినందనలతో -

లిఖిత్ కుమార్ గోదా,

ఐ.ఎం.ఏ- తెలుగు - ద్వితీయ సంవత్సరం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

ఫోన్:- 9640033378